Sunday, May 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం​క‌బ్జాల‌కు హైడ్రా చెక్

​క‌బ్జాల‌కు హైడ్రా చెక్

- Advertisement -

ముష్కిన్ చెరువు క‌బ్జాల‌కు ముకుతాడు
ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌ల‌ తొల‌గింపు
రూ. 5,500ల కోట్ల విలువైన భూమిని కాపాడుతూ ఫెన్సింగ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా సీరియ‌స్‌గా వ్యవహరిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా శ‌నివారం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పలగూడ – నార్సింగ్ గ్రామాల పరిధిలోని ముష్కిన్ చెరువు క‌బ్జాల‌పై క‌న్నెర్ర‌జేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని భూముల స్వ‌రూపం మార్చ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా బ‌డానిర్మాణాల‌కు భూమిని సిద్ధం చేయ‌డాన్ని హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. ముష్కిన్ చెరువు ఎప్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. అభివృద్ధి పేరిట చెరువు మ‌ధ్య‌లోంచి క‌ట్ట‌క‌ట్టి ఎగువున ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న 35.10 ఎక‌రాల భూమిని క‌బ్జా చేయాల‌నే ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా అడ్డుక‌ట్ట‌వేసింది. సంబంధిత శాఖ‌ల స‌మ‌క్షంలో చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధి హ‌ద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేసింది. శ‌నివారం హైడ్రా కాపాడిన భూమి విలువ రూ. 5.500ల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా.

​ముష్కిన్ చెరువు క‌బ్జా జ‌రుగుతోంద‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. మ‌ట్టితో నింపుతున్నార‌ని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్ ఆర్ (సామాజిక బాధ్య‌త‌) నిధుల‌తో ఈ చెరువును అభివృద్ధి చేస్తున్న వారే చెరువు ప‌రిధిని త‌గ్గించి ఆక్ర‌మ‌ణ‌ల‌కు ఆస్కారం క‌ల్పిస్తున్నార‌ని వాపోయారు. చెరువు మ‌ధ్య‌లోంచి క‌ట్ట‌ను ఏర్పాటు చేసి చెరువు ఎగువ‌భాగంలో ఉన్న భూమిని కాజేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు. చెత్త‌ను సేక‌రించి అక్క‌డ వేరు చేసి చెరువులోకి వ్య‌ర్థాలు వ‌ద‌ల‌డంతో ప‌రిస‌రాల‌న్నీ దుర్గంధంగా మార‌డంతో పాటు.. చెరువు క‌లుషిత‌మౌతోంద‌ని వాపోయారు. ఈ ఫిర్యాదుల మేర‌కు క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ, ఇరిగేష‌న్‌, మున్సిప‌ల్ శాఖ‌ల అధికారుల‌తో హైడ్రా విచార‌ణ చేప‌ట్టింది. గ్రామ రికార్డుల మేర‌కు చెరువు విస్తీర్ణం 59.11 ఎక‌రాలు ఉన్న‌ట్టు గుర్తించింది. హెచ్ ఎం డీ ఏ చూపించిన‌ లెక్క‌ల ప్ర‌కారం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధి 52.20 ఎక‌రాలుగా నిర్ధారించుకుంది. స‌ర్వే నంబ‌రు చెరువులో ప్ర‌భుత్వానికి చెందిన శిఖం భూమి 20.23 ఎక‌రాలు ఉంది. అయితే అక్క‌డివ‌ర‌కే చెరువును అభివృద్ధి చేస్తున్న‌ట్టు నిర్ధారించిన అధికారులు చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని మొత్తం కాపాడే క్ర‌మంలో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టి పూర్తి చేసింది.

​ పేద‌వారి పేరుతో కొట్టేసే ప్ర‌య‌త్నాల‌కు చెక్‌..
పేదల పేరిట గుడిసెలు వేసి భూమిని కొట్టేయాలని రియ‌ల్ట‌ర్లు చేస్తున్న ప్ర‌యత్నాల‌ను అక్క‌డ గుడిసెల‌లో ఉన్న వారికి హైడ్రా అధికారులు వివ‌రించారు. క‌బ్జాల‌పై దాదాపుగా ఏడాదిగా ప‌రిశీలిస్తూ వ‌చ్చిన హైడ్రా అక్క‌డ గుడిసెల్లో ఉంటున్న వారు ఖాళీ చేసేందుకు త‌గిన స‌మ‌యం ఇచ్చింది. ఒక‌టికి రెండు సార్లు హైడ్రా అధికారులు వారితో మాట్లాడి 2 నెల‌ల స‌మ‌య‌మిచ్చారు. ఆక్ర‌మ‌ణ‌దారులు త‌మ‌ను పావులుగా వాడుకుంటున్నార‌ని గ్ర‌హించిన చాలామంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. 40 నుంచి 50 వ‌ర‌కూ ఉన్న గుడిసెల‌తో పాటు చెత్తను వేరు చేసే షెడ్డుల‌ను ఖాళీ చేశారు. మ‌రి కొంత‌మంది శ‌నివారం ఉద‌యం ఖాళీ చేశారు. వాళ్లు ఖాళీ చేసిన త‌ర్వాత హైడ్రా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి ఫెన్సింగ్ ప‌నులు పూర్తి చేసింది.

​ స్థానికులు హ‌ర్షం..
క‌బ్జాల‌ను నియంత్రించి చెరువును హైడ్రా కాపాడ‌డంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చెరువును కాపాడాలంటూ వివిధ శాఖ‌ల‌కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డ‌మే కాకుండా సంత‌కాలు సేక‌రించి పెద్దఎత్తున చేప‌ట్టిన ఉద్య‌మం ఫ‌లించింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. ఐటీ కారిడార్‌కు చేరువ‌లో చుట్టూ వేలాది నివాసాల‌కు ఊర‌ట‌గా ఉన్న ఈ చెరువును కాపాడంలో హైడ్రా చూపిన చొర‌వ‌ను కొనియాడారు. హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చెరువులో పోసిన మ‌ట్టిని తొల‌గించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల‌ని ఇప్పుడు వారంతా డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -