Saturday, February 7, 2026
E-PAPER
Homeఖమ్మంయూరప్, ట్రంప్ విధానాల ఒత్తిడికి లొంగిన ప్రధాని మోడీ 

యూరప్, ట్రంప్ విధానాల ఒత్తిడికి లొంగిన ప్రధాని మోడీ 

- Advertisement -

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం చెప్పకుండా పారిపోయిన ప్రధానమంత్రి మోడీ
నరేంద్ర మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరం 
హనుమంతరావు అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుడు 
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు 
నవతెలంగాణ – బోనకల్ 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, యూరప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసుకున్న ఒప్పందాల వలన మన దేశ ప్రజలకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుందని, దేశ చరిత్రలోనే తొలిసారిగా పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం చెప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పారిపోయాడని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఘాటుగా విమర్శించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఆళ్ల హనుమంతరావు అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుడని నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోనే బోనకల్ మండల పరిధిలోనే పెద్ద బీరవల్లి సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ ఆళ్ల హనుమంతరావు సమస్మరణ సభ ఆ గ్రామ సర్పంచ్, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు అధ్యక్షతన శనివారం జరిగింది.

తొలుత ఆళ్ల హనుమంతరావు చిత్రపటానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, డివిజన్ కార్యదర్శి సభ్యులు పాపినేని రామ నరసయ్య, మండల కార్యదర్శి కిలారి సురేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆళ్ల హనుమంతరావు లాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం గ్రామానికి పార్టీకి తీరని లోటు అన్నారు.

పార్టీ ఏ పని అప్పగించిన నీతి నిజాయితీగా పనిచేయటంలో హనుమంతరావు అగ్రభాగాన ఉండేవారన్నారు. గ్రామాభివృద్ధిలో హనుమంతరావు పాత్ర మరువలేనిది అన్నారు. గ్రామపంచాయతీ నిర్వహణలో హనుమంతరావు ఎంతో క్రమశిక్షణగా నిర్వహించారని కొనియాడారు. ప్రజా ఉద్యమాలు ఉన్నంతవరకు హనుమంతురావు గుర్తుండిపోతారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానాల వలన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు వ్యవస్థలో కమ్యూనిస్టుల బలం లేకపోవడం వలన బూర్జువా పార్టీల బలం ఉండటము వలన ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడిందన్నారు. యూరప్ తో చేసుకున్న ఒప్పందం వలన మన దేశానికి ఎంతో నష్టమన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లొంగిపోయి దేశ ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగించే ఒప్పందాలను అంగీకరించాడని విమర్శించారు.

అమెరికా మనదేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగ్గించగా అమెరికాకు ఎగమతి అవుతున్న మనదేశ వస్తువులపై 18 శాతానికి పైగా ట్రంప్ సుంకాలు విధిస్తే దానిని ప్రధానమంత్రి అంగీకరించాడని విమర్శించారు. ప్రధానంగా మన దేశ వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. మనదేశ పరిశ్రమలు దెబ్బతింటాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒత్తిడికి లొంగి రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించారని విమర్శించారు. అమెరికా వస్తువులు మనదేశంలోకి దిగుమతి చేసుకోవడం వలన సుమారు 45 లక్షల కోట్లు నష్టపోతున్నామన్నారు. రూ.1500 లక్షలు కోట్లు మన దేశంపై నరేంద్ర మోడీ అప్పుల భారం మోపాడని విమర్శించారు.

రూ. 16 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు మాఫీ చేశారని, ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడిదారులు ఎగ్గొట్టారని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వాటాలను ఇవ్వటం లేదని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇవ్వటం లేదన్నారు. మోదీ విధానాలు మన దేశానికి ప్రమాదకరంగా మారాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె కార్మిక సంఘాలు చేపట్టినట్టు తెలిపారు. మన దేశ చరిత్రలోనే పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ నుంచి పారిపోయి రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందన్నారు. 

అదాని, అంబానీలకు ప్రధానమంత్రి వ్యాపార వస్తువుగా మారాడు: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు 
అదాని, అంబానీలకు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాపార వస్తువుగా మారిపోయాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు విమర్శించారు. పెట్టుబడిదారులకు ఉపయోగపడే చట్టాలను, ఒప్పందాలను చేస్తూ కార్మికులకు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను తొలగిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి ప్రధానమంత్రి కార్మిక ద్రోహిగా మిగిలి పోయారని విమర్శించారు. ఢిల్లీలో రైతులు ఆందోళన సందర్భంగా 700 మంది రైతులు మృతి చెందారని, వీరి మృతికి కారణం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నారు. అసెంబ్లీలో నేరస్తులు, పార్లమెంటులో పెట్టుబడుదారుల సంఖ్య పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, కేంద్ర ప్రభుత్వం విబిజి రాంజీ పథకాన్ని తీసుకువచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. రాబోయే రోజులు పోరాటాల కాలం అన్నారు. హనుమంత రావు లాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం చాలా బాధాకరమన్నారు. పెద్ద బీరవల్లిలో సీపీఐ(ఎం) బలమైన పార్టీగా ఉంచడంలో హనుమంతరావు కృషి కూడా ఎంతో ఉందన్నారు. పార్టీని నిలబెట్టడంలో హనుమంతరావు పాత్ర అమోఘం అన్నారు. సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు పాపినేని రామ నరసయ్య మాట్లాడుతూ.. హనుమంతరావు మృతి సిపిఎం కు తీరని లోటు అన్నారు.

హనుమంతరావు తన జీవితాంతం పార్టీకి అంకితమై పని చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరారు. మండల కార్యదర్శి కిలారి సురేష్, ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ మంద కరుణ, పెద్ద బీరవల్లి మాజీ సర్పంచ్ లు ఆళ్ల పుల్లమ్మ, మిర్యాల వెంకటకృష్ణ, లక్ష్మీపురం పెద్ద బీరవల్లి ఉపసర్పంచులు కిలారి రామకోటయ్య పెద్దపోలు రామారావు సీపీఐ(ఎం) నాయకులు చింతలచెరువు రమేష్ తాళ్లూరు దుర్గా ప్రదీప్ హనుమంతరావు అల్లుళ్లు తుళ్లూరు హనుమంతరావు కన్నీటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -