Sunday, February 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇటు చర్చలు..అటు ఆంక్షలు

ఇటు చర్చలు..అటు ఆంక్షలు

- Advertisement -

ట్రంప్‌ డబుల్‌గేమ్‌

మస్కట్‌ : ఒమన్‌ రాజధాని మస్కట్‌లో ఇరాన్‌, అమెరికా మధ్య పరోక్ష చర్చలు జరుగుతుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ డబుల్‌గేమ్‌కు దిగారు. మస్కట్‌లో జరిగిన భవిష్యత్తులో కూడా ఇరు పక్షాలు చర్చలను కొనసాగించేందుకు అంగీకరించాయని ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరగ్చిని ఉటంకిస్తూ ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని ఇరాన్‌ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న అరగ్చి తెలిపారు. ముందుగా ఉభయ పక్షాలు వారి వారి దేశాల్లో చర్చలు జరపాలని, ఆ తర్వాత తదుపరి దఫా చర్చలు ఎప్పుడు, ఎక్కడ అనేది నిర్ణయించుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ చర్చలు కేవలం అణు సంబంధిత అంశాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయని అరగ్చి చెప్పారు. మరే ఇతర అంశాలపై ఇరాన్‌, మాట్లాడలేదన్నారు. బెదిరింపులు, ఒత్తిళ్లు వంటి వాటికి దూరంగా ఈ చర్చలు జరగాలని తాము స్పష్టం చేసినట్టు ఇరాన్‌ ప్రతినిధి బృందం తెలిపింది.

చర్చల కొనసాగింపునకు ఒక ప్రాతిపదికను సిద్ధం చేసేటపుడు ఈ అంశాన్ని కచ్చితంగా పాటిస్తారని ఇరాన్‌ ఆశిస్తోందని పేర్కొంది. ఒమన్‌ విదేశాంగ మంత్రి అనేకసార్లు ఇరాన్‌, అమెరికా ప్రతినిధుల బృందాలతో సమావేశాలు జరిపారని, దీనివల్ల తమ అభిప్రాయాలు పరస్పరం మార్పిడి చేసుకున్నామని తెలిపారు. గతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్రమైన అవిశ్వాసం ఇప్పుడు చర్చలకు తీవ్రమైన సవాలుగా నిలిచిందని అన్నారు. అందువల్ల ముందుగా ఆ వాతావరణాన్ని అధిగమించాల్సి వుందన్నారు. ఆ తర్వాతనే ఇరాన్‌ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమయ్యే రీతిలో కొత్తగా చర్చలకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించగలుగుతామని అరగ్చి తెలిపారు. చర్చల అనంతరం ఒమన్‌ విదేశాంగ మంత్రి అల్‌ బుసైది ఎక్స్‌లో పోస్టు పెడుతూ, ”చర్చలు చాలా సీరియస్‌గా ఉపయుక్తంగా జరిగాయి” అని తెలిపారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడానికి ఈ చర్చలు ఉపకరించాయని చెప్పారు. ఈ నాటి చర్చల్లో వచ్చిన ఫలితాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటూ త్వరలోనే మళ్లీ సమావేశమవుతాయని చెప్పారు. కాగా మరోవైపు 15 ఆయిల్‌ సంస్థల సరఫరాపై అమెరికా నిషేధం విధించినట్టు అమెరికా లీకులు ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -