వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు
200 గొర్రెలు, మేకలు మృత్యువాత
నవతెలంగాణ- డిండి
రోడ్డుపై ఆగి ఉన్న రెండు డీసీఎంలను మూగజీవాల లోడ్తో వెళ్తున్న మరో డీసీఎం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. 200గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంట్లపల్లి గ్రామశివారులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. డిండి ఎస్ఐ సిహెచ్.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..నాగర్కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన చిట్టికొండ ఎల్లయ్య(35), ఆయన కుమారుడు మల్లేష్, మరికొందరు కలిసి రెండు డీసీఎంలలో గొర్రెలను తరలిస్తున్నారు. అదే సమయంలో వేరే డీసీఎం వెనుక టైరు పంచర్ కావడంతో హైవేపై నిలిపి మరమ్మతు పనులు చేస్తున్నారు. ఆ పనులకు వెలుతురు కల్పించేందుకు ఇంకో డీసీఎంను వెనుక భాగంలో నిలిపారు. ఈ రెండు డీసీఎంలను వెనుక నుంచి గొర్రెలు, మేకల లోడుతో వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఘటనా స్థలంలో టర్నింగ్ ఉండటంతో కనబడక పక్క నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిట్టికొండ ఎల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మూడు డీసీఎంలలో ఉన్న సుమారు 200 మేకలు, గొర్రెలు మృతువ్యాతపడ్డాయి. చిట్టికొండ పద్మ, ఆమె కుమారుడు మల్లేష్ గాయపడ్డారు. మరికొన్ని మేకలు, గొర్రెలు కూడా గాయపడ్డాయి. సమాచారం అందుకున్న డిండి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిట్టికొండ ఎల్లయ్య భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.
డీసీఎంలను ఢీకొట్టిన మరో డీసీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



