నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘హైదరాబాద్లోని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్లో వివిధ కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు, పత్రాలున్న కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం జాన్వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్, నయీం కేసు, భూ కుంభకోణాలు, ఓటుకు నోటు కేసు, ఇతర రాజకీయ అవినీతి కేసులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు ఈ విభాగంలోనే ఉన్నాయని సమాచారం. కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడే ప్రమాదం జరగడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంలో కీలక ఫైళ్లు, డిజిటల్ డేటాకు నష్టం వాటిల్లలేదని అధికారులు చెపుతున్నప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రావాల్సి వుంది. గతంలో సచివాలయంలో, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో.. ఇలా పదేపదే ప్రభుత్వ రికార్డులే తగలబడటం వెనుక ఉన్న కారణాలేమిటి? ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆఫీసుల్లో రికార్డులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరమున్నది. ప్రమాదంలో ఏయే కేసులకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయాయో పూర్తి వివరాలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. భద్రతలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో అగ్నిప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ముఖ్యంగా రికార్డు రూముల్లో అగ్నిప్రమాదాల నివారణకు తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి : సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



