కేంద్రం స్పందించాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-చార్మినార్
సింగరేణి సంస్థలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తోందని, ఇది పెద్ద కుంభకోణానికి నిదర్శనమని అన్నారు. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు లెక్కల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ రాసి సమగ్ర విచారణ కోరనున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని, బాల్క సుమన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం ఆపరని స్పష్టం చేశారు. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్పై చేసిన వ్యాఖ్యలను, అలాగే ఇతర నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేశారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కానీ బాల్క సుమన్ విషయంలో మాత్రం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కార్మికుల సమస్యలు, ఆవేదనలను ప్రతిబింబించే క్రమంలోనే బాల్క సుమన్ మాట్లాడారని, ఆయనపై కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. సింగరేణి బొగ్గు నిల్వలు, ఉత్పత్తి గణాంకాలపై పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.
సింగరేణిలో భారీ అవకతవకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



