Tuesday, February 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతులకు బోనస్‌ ఆపండి

రైతులకు బోనస్‌ ఆపండి

- Advertisement -

కేరళ రాష్ట్ర సర్కారుపై కేంద్రం ఆంక్షలు
అధిక నిల్వలు పేరుకుపోతున్నాయంటూ కొర్రీలు
బోనస్‌ ఇవ్వడంపై పున:సమీక్షించాలని సూచన
రైతులకు ఎమ్‌ఎస్‌పీతో పాటు బోనస్‌ ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్‌ సర్కార్‌
బోనస్‌ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా
అధిక ధాన్యం నిల్వల పేరుతో తెలంగాణపైనా ఆంక్షలు విధించే ప్రమాదం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కార్పొరేట్లకు మేలు చేసేందుకు మోడీ సర్కారు రైతుల మీద కక్ష కట్టింది. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూనే అన్నదాతలకు చేయాల్సిన నష్టాన్ని వివిధ రూపాల్లో చేస్తూ పోతున్నది. ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని రాతపూర్వక హామీనిచ్చి మోసం చేయడమే కాదు..రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు మద్దతు ధరతో పాటు బోనస్‌ ఇస్తే సహకరించేది లేదంటూ మెలికలు పెట్టి కూర్చున్నది.

కేరళ ప్రభుత్వం వరి పంటకు ఇస్తున్న బోనస్‌ను తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇష్టానుసారంగా ధాన్యం సేకరించడం వల్ల ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయనీ, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అందులో పేర్కొంది. అయితే, రైతులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్‌ కూడా చెల్లిస్తామనీ, రైతుకు మద్దతు కొనసాగిస్తామని కేరళలోని వామపక్ష ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, వరి అధికంగా పండిస్తున్న, అన్నదాతలకు బోనస్‌ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అధిక ధాన్యం నిల్వల పేరుతో తెలంగాణపైనా ఆంక్షలు విధించే ప్రమాదం ఉందనే చర్చ నడుస్తున్నది.

ఎమ్‌ఎస్‌పీకి తోడు రాష్ట్రాల బోనస్‌
కేంద్ర ప్రభుత్వం వరి పంటను రెండు గ్రేడులుగా విభజించి కామన్‌ రకాలకు రూ.2,369, గ్రేడ్‌-1 రకాలకు రూ.2,389 ఇస్తున్నది. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు పెద్దగా ఏమీ మిగలటం లేదు. అయితే, కేంద్ర నిర్ణయించిన కనీస మద్దతు ధర(ఎమ్‌ఎస్‌పీ) రైతులకు సరిపోవడం లేదనే కారణంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్‌ఎస్‌పీతో పాటు బోనస్‌ను కూడా ప్రత్యేకంగా చెల్లిస్తున్నాయి. క్వింటా ధాన్యానికి ఎమ్‌ఎస్‌పీ+బోనస్‌తో కలిపి రూ.3 వేలకుపైగా ఇస్తున్న రాష్ట్రాల్లో కేరళ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాకు రూ.700 చొప్పున రైతులకు బోనస్‌ ఇస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తుండగా, గుజరాత్‌ రూ.300, రాజస్థాన్‌ రూ.125 చొప్పున అందజేస్తున్నాయి. ఇప్పుడు ఈ బోనస్‌ కూడా ఇవ్వకుండా చేయాలనే ఆలోచనకు మోడీ సర్కారు వచ్చింది. అందులో భాగంగా ముందు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ను టార్గెట్‌ చేస్తున్నది. రైతుకు ఇస్తున్న అదనపు బోనస్‌ను తక్షణమే ఆపేయాలని కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. అయితే, ఒక్క కేరళ రాష్ట్రానికే ఇవ్వడం చర్చనీయాంశం అవుతున్నది.

పోరు ఆగగానే మాట తప్పుతున్న మోడీ సర్కారు
మూడు నల్ల చట్టాలు వద్దంటూ రైతులు ప్రదర్శించిన పోరాట పటిమతో అప్పటికి కాస్త వెనక్కి తగ్గిన మోడీ సర్కారు ఆ మూడు చట్టాలు అమలు చేయబోమనీ, రైతులకు కనీస మద్దతు ధరల చట్టం తీసుకొస్తామని లిఖితపూర్వకంగా దేశరైతాంగానికి హామీనిచ్చింది. పోరాటం ఆపాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా విస్మరిస్తూపోతున్నది. పైగా, రాష్ట్రాల హక్కులను లాగేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలతో కనీసం చర్చించకుండానే చట్టాలను రూపొందిస్తూపోతున్నది.

కనీస మద్దతు ధరల చట్టం చేయాలనే డిమాండ్‌ను బుట్టదాఖలు చేసింది. పైగా, ఎమ్‌ఎస్‌పీ రేట్లను పెంచామని తమ పార్టీ శ్రేణులతో సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకుంటున్నది. అదే సమయంలో రైతుల మొత్తం పంటను కొనట్లేదనే విషయాన్ని ప్రచారంలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నది. ఇప్పటికే పత్తిపంట విషయంలో ఎకరానికి ఏడుక్వింటాళ్లే అనే నిబంధనను తీసుకొచ్చింది. కపాస్‌ కిసాన్‌ యాప్‌ తెచ్చి రైతులను తికమకపెట్టింది. సోయాబీన్‌ కొనుగోళ్ల విషయంలోనూ ఇదే షరతు విధించింది. రైతుల పంటలను కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం సగం కూడా కొనట్లేదు. రైతులు ఎక్కువగా ప్రయివేటు మార్కెట్‌లో పంటను అమ్ముకుని దళారుల చేతుల్లో మోసపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

రైతులకు బోనస్‌ ఇస్తే తప్పేంటి?
కేంద్రం కిలో ధాన్యం మద్దతు ధర రూ.23.7 నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇస్తున్న మద్దతు ధరకు అదనంగా బోనస్‌ కలిపి కిలోకు రూ.30 చెల్లించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఇప్పటివరకూ రూ.1344 కోట్ల పెండింగ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రకటించింది. 2024, 25 సంవత్సరాలకు సంబంధించే రూ.500 కోట్లు రావాల్సి ఉందని ఎత్తిచూపింది. ఇష్టానుసారంగా రైతులకు బోనస్‌లు ఇస్తూ ధాన్యం కొనడం ద్వారా ఆ రాష్ట్రంలో బఫర్‌ నిల్వలు పెరిగిపోతున్నాయనీ, బోనస్‌ ఇస్తే ధాన్యం కొనుగోళ్లను ఆపేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అంతే వేగంగా తిప్పికొట్టింది.

రైతులకు అదనంగా రూ.700 బోనస్‌ ఇస్తే నష్టమేంటి? అదీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కదా? ఎందుకు ఆపాలి? కార్పొరేట్లకు వేల కోట్ల రాయితీలు ఇస్తుండగా..రైతుల కష్టానికి కొంతమేరకైనా ఫలం దక్కాలనే ఆలోచన ఎలా తప్పవుతుంది? అనే ప్రశ్నలను వామపక్ష పార్టీల నేతలు కేంద్రంపై సంధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ధాన్యాన్ని కొంటామని విజయన్‌ సర్కారు స్పష్టం చేసింది. రెండో పంట కాలంలో పాలక్కడ్‌ జిల్లాలో సహకార సంఘాల ద్వారా ఫైలట్‌ పద్ధతిలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

కార్పొరేట్‌ వ్యవసాయం దిశగా అడుగులు
విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చి వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లను బిగిస్తూపోతున్నది. ఇప్పటికే బీజేపీ, దానికి మద్దతిచ్చే పార్టీల పాలిత రాష్ట్రాల్లో స్మార్ట్‌ మీటర్లు బిగించగా..వేల రూపాయల కరెంటు బిల్లులు వస్తున్నాయనీ, ఇలాగైతే తాము వ్యవసాయం చేయలేమని రైతులు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇదే చట్టం ద్వారా ప్రభుత్వ విద్యుత్‌ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటుపరం చేస్తూపోతున్నది.

చండీఘడ్‌లో పబ్లిక్‌ సెక్టార్‌లో ఉన్న రూ.22 వేల కోట్ల ఆస్తులు కలిగిన పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రూ.174 ప్రాథమిక ధరగా నిర్ణయించింది. ఆ కంపెనీని రూ. 871 కోట్లకు గోయెంకా కంపెనీకి కట్టబెట్టింది. ఇదిలావుండగా విత్తనంపై ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన నాలుగు ప్రముఖ కంపెనీలకు గుత్తాధిపత్యం కల్పించేందుకు మోడీ సర్కారు శరవేగంగా పావులు కదుపుతున్నది. వీటన్నింటి వెనుక అన్నదాతను వ్యవసాయ రంగం నుంచి సాగనంపి కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర దాగి ఉన్నదనేది నిగూఢ సత్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -