నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జూన్ 15వ తేదీ తర్వాత ఆయన సంగతి బరాబర్గా తేలుస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్లో రూ.1600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
“తెలంగాణ ప్రజలతో గోక్కున్నవాడు ఎవరూ బాగుపడలేదు” అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కాళ్లల్లో కట్టెలు పెట్టి ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. “రీజనల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం నేను యాభై సార్లు ఢిల్లీకి వెళ్లాను, ప్రధానిని కలిశాను. దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా? హైదరాబాద్ ప్రజలు ఆయనకు ఓట్లు వేయలేదా?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


