బీజేపీలో ఉండి ఇంకోపార్టీ సహకారం తీసుకుంటున్నాడు
గతంలో ఇలాచేస్తేనే ఆయన్ని ప్రజలు ఓడించారు
రాష్ర్టంపట్ల బాధ్యత లేనట్టే వ్యవహరిస్తున్నారు
ఈనెల 15 తర్వాత ఆయన సంగతి చెప్తా: ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి
‘ఎంఎంసీ’ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు
సీఎం శంకుస్థాపనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి మోకాలడ్డుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అహ్మదాబాద్లో సబర్మతీ రివర్ ప్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ప్రంట్, యూపీలో గంగానది రివర్ ప్రంట్ను అభివృద్ధి చేసుకుంటున్నారనీ, తెలంగాణలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మురికి నల్లగొండ ప్రజలకు కాలుష్యమై కాటేస్తున్నదనీ, ఒక వైపు ఫ్లోరైడ్ సమస్య, రెండో వైపు మూసీ కాలుష్యం, మరోవైపు చచ్చిన శవాల కళేబరాలు నల్లగొండ జిల్లాకు కొట్టుకొస్తుంటే ఆ ప్రాంత ప్రజలు మూసీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారని తెలిపారు. మూసీ బాధితులకు ఇంటికి ఇల్లు, ఉపాధికి ఉపాధి, ఉడ్యోగ అవకాశాలు కల్పిద్దామంటే కేంద్రమంత్రి ఎందుకు ముందుకురావట్లేదని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్కు అనుమతులు తేవాల్సిన బాధ్యత ఆయనకు లేదా అడిగారు. ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రోరైల్ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయిందనీ, దీన్ని 122 కి.మీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే దాన్నకి కూడా కిషన్రెడ్డే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
రీజనల్ రింగ్ రోడ్డు వస్తే 360 కిలో మీటర్లు అభివృద్ధి జరుగుతుందనీ, గడిచిన రెండున్నరేండ్లలో అభివృద్ధి పనుల సహకారం కోసం 50 సార్లు ఢిల్లీకి వెళ్లి, ఐదు సార్లు ప్రధాని మోడీని కలిసినా పనులు ఆగుతున్నాయంటే దానికి కారణం కిషన్రేడ్డే కాదా అని ప్రశ్నించారు. మూసీకి నిధులు, మెట్రోకు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్న బాధ్యత ఈ ప్రాంత బీజేపీ నేతలకు లేదా అని అడిగారు. ఈనెల 15లోపు కేంద్రం 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనకుంటే, అప్పుడు కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంగతి చెప్తామని హెచ్చరించారు. తుమ్మిడి హెట్టికి సైతం ఆయనే అడ్డుపడుతున్నారనీ, మహారాష్ర్ట సీఎంకు పదిసార్లు లేఖలు రాసినా సమాధానం ఎందుకు రావట్లేదో అర్థం చేసుకోవాలన్నారు.
బీజేపీలో ఉంటూనే తెరవెనుక నుంచి మరోపార్టీ సహకారాన్ని ఆయన తీసుకుంటున్నారనీ, గతంలో ఇలా చేస్తేనే ప్రజలు ఆయన్ని ఓడించారని గుర్తుచేశారు. అభివృద్ధి పనులకు అనుమతుల కోసం కేంద్రమంత్రుల దగ్గరికి వస్తానన్నా, కిషన్రెడ్డి తీసుకెళ్లట్లేదనీ, కుమ్మక్కు రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాష్ర్టాభివృద్ధికి కేంద్రమంత్రి కలిసి వస్తే ఎల్బీ స్టేడియంలో ఆయనకు గండపెండేరం తొడుగుతామని చెప్పారు. ఆదివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని ఉప్పల్ భగాయత్లో రూ.1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పదెకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించనున్న ‘ఎంఎంసీ’ భవన నిర్మాణం, రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజీ జంక్షన్లో 6 లైన్ల ప్లై ఓవర్ నిర్మాణం, రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ‘క్యూర్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా.. ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాల్సి ఉండేదనీ, అంతదూరం వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే పాలనను వికేంద్రీకరించామన్నారు.
జోనల్ కమిషనర్కు ఉండే పరిధే డీసీపీకి కూడా ఉంటుందనీ, అన్ని శాఖల సమన్వయం కోసమే జీహెచ్ఎంసీని మూడుగా విభజించామని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు సరైన సహకారం అందకపోవడంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆశించిన మేరకు అభివృద్ధి చేయలేకపోయానని అంగీకరించారు. గతంలో నగరంలో జీపీలు, జెడ్పీ, మున్సిపాల్టీలు, జీహెచ్ఎంసీ ఇలా నాలుగు రకాల పరిపాలనా విభాగాలు ఉండటంతో సహకారం సరిగ్గా అందక ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తయారుచేయడంతోపాటు రాష్ర్టాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడానికే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చామని చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపలనే దాదాపు 2100 స్కోయర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1 కోటీ 34 లక్షల జనాభా ఉందనీ తెలిపారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వీరిందరికీ మౌలిక వసతులు కల్పిండానికి, పరిపాలనా సమన్వయం కోసం ‘క్యూఆర్’గా నామకరణం చేసి జీహెచ్ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ కారిడార్ ఎలివేటెడ్ నుంచి శామిర్పేట మెట్రో విస్తరణ పనులతో సహా అన్ని పనులూ పూర్తి చేస్తామన్నారు. గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ ఫేజ్1 మొదటి విడతగా పని చేస్తున్నామనీ, ఫేజ్ 2లో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 100 రోజుల్లో మూసీ ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని చెప్పారు.



