నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షినటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికల ఆఫిడవిట్లో ఓ కేసుకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదనే కారణంతో ఆ రాష్ట్ర ఎన్నికల రిటర్న్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ప్రతినిధుల బృంద సభ్యులు కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వీ, జైరాం రమేష్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, వివేక్ తంఖా, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బఘేల్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సమావేశం అనంతరం మీనాక్షినటరాజన్ మీడియాతో మాట్లాడారు.
‘తాము తమ వాదనలను ఎన్నికల సంఘం ముందు ఉంచామని, ఇప్పుడు వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని నటరాజన్ చెప్పారు. “రాజ్యాంగబద్ధమైన సంస్థలపై మాకు ఇంకా పూర్తి నమ్మకం ఉంది, అందుకే మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఎన్నికల సంఘం ఈ రోజు మా వాదనను విన్నది, ఇప్పుడు మేము వేచి చూస్తున్నాము. మా పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో ఏదో ఒక రూపంలో ప్రజాస్వామ్య విలువలు ఇంకా మిగిలే ఉంటాయని మేము ఇప్పటికీ నమ్ముతున్నాము,” అని నటరాజన్ పేర్కొన్నారు. పార్టీకి చెందిన న్యాయ నిపుణుల బృందం కమిషన్ ముందు తమ వాదనలను వినిపించిందని ఆమె తెలిపారు. “మా తరఫున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలను సమర్పించారు, మేము మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు.



