మార్క రఘుపతి గౌడ్, ఉమాదేవి
నవతెలంగాణ – పరకాల
ప్రజాపాలన వార్డు సభల ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నేత కొక్కిరాల రాకేశ్రావు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఉమాదేవి విమర్శించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంటే, దాన్ని కాలయాపన అంటూ విమర్శించడం హాస్యాస్పదమని వారు పేర్కొన్నారు. రాకేశ్రావు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రఘుపతి గౌడ్, ఉమాదేవి దంపతులు, ప్రభుత్వ కార్యక్రమాలను బయట విమర్శిస్తూనే, అదే సమయంలో అధికారిక వేదికలను ఆయన ఎలా అలంకరిస్తున్నారని ప్రశ్నించారు.
అభివృద్ధిని అడ్డుకుంటూ ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తూనే, మరోవైపు ప్రభుత్వ వేదికలపై గౌరవంగా కనిపించడం రాకేశ్రావు ద్వంద్వ వైఖరికి పరాకాష్ట అని వారు ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో ఇలాంటి నాటకీయ రాజకీయాలు మానుకోవాలని వారు హితవు పలికారు. గత పదేళ్ల పాలనలో సమస్యలను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు, నేడు ప్రజల వద్దకే వస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమని వారు అన్నారు. ప్రజా పాలన సభల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరవేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజాహిత పనులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.



