నవతెలంగాణ – గీసుగొండ: గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన కీ.శే. కూసం రాజమౌళి 74వ జయంతి సందర్భంగా గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి శ్రీమతి కూసం లలిత కేక్ కట్ చేసి రాజమౌళి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూసం స్వరూప్–రమేష్ మాట్లాడుతూ, రాజమౌళి గ్రామ అభివృద్ధి కోసం చేసిన విశేష కృషిని కొనియాడారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత, గ్రామానికి అందించిన మార్గదర్శకత్వం గంగదేవిపల్లి అభివృద్ధికి బాటలు వేసిందని పేర్కొన్నారు. రాజమౌళి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామ పెద్దలు కూసం లింగయ్య, గోనె రాజయ్య, సల్ల మల్లయ్య, గోనె సంపత్, పెండ్లి రాజయ్య తదితరులు రాజమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన గ్రామాభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ స్మృతులను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువతీ యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజమౌళి సేవలను స్మరించుకున్నారు. “గంగదేవిపల్లి గ్రామమంటే రాజమౌళి, రాజమౌళి గారంటే గంగదేవిపల్లి” అనేలా గ్రామ అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోయిందని పలువురు పేర్కొన్నారు. రాజమౌళి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.



