64 పరుగులతో భారత్ ఘన విజయం
దీప్తి శర్మ ఐదు వికెట్ల మాయాజాలం
స్మృతీ మంధాన అర్థ శతక జోరు
బర్మింగ్హామ్ (ఇంగ్లాండ్) : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ వేటను టీమ్ ఇండియా ఘనంగా మొదలెట్టింది. పొరుగు దేశం పాకిస్తాన్పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్ దశలో బోణీ కొట్టింది. బ్యాట్తో, బంతితో పాకిస్తాన్పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన హర్మన్ప్రీత్ కౌర్ బర్మింగ్హామ్లో చెలరేగింది. స్పిన్నర్ దీప్తి శర్మ (5/10) ఐదు వికెట్ల మాయాజాలంతో పాకిస్తాన్ విలవిల్లాడింది. తెలుగు తేజం శ్రీ చరిణి (3/21) మూడు వికెట్లతో మ్యాజిక్ చేసింది. దీంతో 171 పరుగుల ఛేదనలో పాకిస్తాన్ అమ్మాయిలు 17 ఓవర్లలో 106 పరుగలకే కుప్పకూలింది. ఓపెనర్ మునీబ అలీ (41, 35 బంతుల్లో 5 ఫోర్లు) రాణించినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. గుల్ ఫెరోజా (12), అయేషా జాఫర్ (12), సైరా జబీన్ 92), నటాలియ (7), ఫాతిమా సనా (0) స్పిన్ మాయకు బోర్లా పడ్డారు. ఆఖర్లో అలియా రియాజ్ (18) పాక్కు మూడంకెల స్కోరు అందించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (6) సిక్సర్తో ఇన్నింగ్స్ను ఆరంభించినా తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ స్మృతీ మంధాన (68, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (36, 35 బంతుల్లో 4 ఫోర్లు), రిచా ఘోష్ (34,17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. జెమీమా రొడ్రిగ్స్ (1), బార్తి ఫుల్మాలి (1) నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో సదియా ఇక్బాల్, ఫాతిమా సనా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఐదు వికెట్లతో మాయ చేసిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. గ్రూప్-బిలో భారత్ తన తర్వాతి మ్యాచ్లో బుధవారం లీడ్స్లో నెదర్లాండ్స్తో తలపడనుంది.
పాక్పై ఫటాఫట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



