తొలి టీ20లో ఆసీస్పై భారత్ గెలుపు
సిడ్నీ (ఆస్ట్రేలియా) : హైదరాబాద్ అమ్మాయి, యువ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) నాలుగు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరగటంతో ఆస్ట్రేలియా మహిళలతో తొలి టీ20లో భారత్ పైచేయి సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 21 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జార్జియా వారెహామ్ (30, 19 బంతుల్లో 4 ఫోర్లు), లిచ్ఫీల్డ్ (26, 19 బంతుల్లో 5 ఫోర్లు), జార్జియా వోల్ (26, 10 బంతుల్లో 4 ఫోర్లు), ఎలిసీ పెర్రీ (20, 11 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. బెత్ మూనీ (5), గార్డ్నర్ (4), అనాబెల్ (3), నికోల (12), కిమ్ (2) నిరాశపరిచారు.
భారత వెటరన్ పేసర్ రేణుక సింగ్ (2/14), యువ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత అమ్మాయిలు 5.1 ఓవర్లలో 50/1తో నిలిచారు. ఓపెనర్ స్మృతీ మంధాన (16 నాటౌట్, 17 బంతుల్లో 2 ఫోర్లు), జెమీమా రొడ్రిగ్స్ (9 నాటౌట్, 3 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలువగా.. షెఫాలీ వర్మ (21, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ 5.1 ఓవర్ల వద్ద నిలిచిపోగా.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో లక్ష్యాన్ని 5.1 ఓవర్లలో 30 పరుగులకు సవరించారు. దీంతో భారత మహిళల జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ముందంజ వేసింది.



