పాక్పై 61 పరుగులతో భారత్ గెలుపు
అర్థ సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్
బుమ్రా, హార్దిక్, అక్షర్, వరుణ్ మ్యాజిక్
భారత్ 175/7, పాకిస్తాన్ 114/10
నవతెలంగాణ-కొలంబో
పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాక్పై 61 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. ఐసీసీ టీ20 ప్రపంచకప్లో సూపర్ఎయిట్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇషాన్ కిషన్ (77, 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ అర్థ సెంచరీతో చెలరేగటంతో తొలుత భారత్ 175/7 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (32, 29 బంతుల్లో 3 ఫోర్లు), శివం దూబె (27, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (25, 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో పాకిస్తాన్ 18 ఓవర్లలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు సమిష్టిగా విజృంభించారు. హార్దిక్, బుమ్రా, వరుణ్, అక్షర్ రెండేసి వికెట్లు పడగొట్టగా పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున ఉస్మాన్ ఖాన్ (44, 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), షహీన్ షా అఫ్రిది (23 నాటౌట్, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. భారత్ గ్రూప్ దశలో ఆఖరు మ్యాచ్లో బుధవారం నెదర్లాండ్స్తో తలపడుతుంది.
పాక్ పేకమేడలా..
176 పరుగుల ఛేదనలో పాకిస్తాన్ చతికిల పడింది. స్పిన్కు అనుకూలించే పిచ్పై పేస్తో వికెట్ల వేట మొదలెట్టిన భారత్ ఆ దిశగా విజయవంతమైంది. హార్దిక్ ఓవర్లో ఫర్హాన్ (0) డకౌట్ కాగా.. బుమ్రా ఓవర్లో ఆయుబ్ (6), సల్మాన్ (4) నిష్క్రమించారు. 2 ఓవర్లలో 13/3తో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. అక్షర్ పటేల్ మాయకు బాబర్ ఆజమ్ (5) బోల్తా పడటంతో పాక్ ఓటమి కోరల్లో పడింది. పవర్ప్లేలో ఆ జట్టు 38/4తో డీలా పడగా మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఈ దశలో ఉస్మాన్ ఖాన్ (44), షాదాబ్ ఖాన్ (14) భారత బౌలర్లను ఎదురించే ప్రయత్నం చేశారు. పది ఓవర్లలో 71/4తో నిలువగా.. బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడింది. దూకుడుగా ఆడేందుకు యత్నించిన పాక్ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కుప్పకూలింది. షహీన్ షా అఫ్రిది (23 నాటౌట్) పాక్ ఓటమి అంతరానికి కుదించాడు. 18 ఓవర్లలో పాకిస్తాన్ 114 పరుగులకు కుప్పకూలింది. భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య (2/16), బుమ్రా (2/17), అక్షర్ పటేల్ (2/29), వరుణ్ చక్రవర్తి (2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ (1/11), కుల్దీప్ యాదవ్ (1/14) రాణించారు.
కిషన్ ఒక్కడే..!
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన భారత్కు కలిసి రాలేదు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (0) పాక్ కెప్టెన్ సల్మాన్ ఉచ్చులో పడ్డాడు. అభిషేక్ను ఊరించిన సల్మాన్ ఇన్నింగ్స్ ఆరో బంతికే అవుట్ చేశాడు. అభిషేక్ వికెట్ పాక్ శిబిరంలో ఉత్సాహం నింపింది. కానీ, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (77) దుమ్మురేపాడు. షహీన్ షా అఫ్రిదికి సిక్సర్తో స్వాగతం పలికిన ఇషాన్ కిషన్.. పవర్ప్లేలో రెచ్చిపోయాడు. 7 ఫోర్లు, 3 సిక్స్లతో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ (25)తో కలిసి రెండో వికెట్కు 46 బంతుల్లో 87 పరుగులు జోడించాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో పాక్ బౌలర్లను ఒత్తిడిలో పడేసిన ఇషాన్ సెంచరీ దిశగా సాగాడు. ఆయుబ్ ఓవర్లో కిషన్ వికెట్ కోల్పోయాడు. కిషన్ అవుటయ్యే సరికి భారత్ స్కోరు 88/2 కాగా.. అందులో కిషన్ ఒక్కడే 77 పరుగులు చేశాడు.
కిషన్ నిష్క్రమణతో భారత దూకుడుకు కళ్లెం పడింది. తిలక్ వర్మ ఓ ఎండ్లో కుదురుకున్నా బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్లు 38 పరుగుల భాగస్వామ్యంతో మెరిసి భారీ స్కోరుకు పునాది వేశారు. కానీ స్పిన్నర్ ఆయుబ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస బంతుల్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (0)ను సాగనంపి గట్టి దెబ్బకొట్టాడు. సూర్య తనదైన దూకుడు చూపించకపోయినా.. తొలుత తిలక్తో, ఆ తర్వాత దూబెతో కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. శివం దూబె (27), రింకు సింగ్ (11 నాటౌట్) ఆఖరు ఓవర్లో 16 పరుగులు పిండుకుని భారత్కు 175 పరుగుల స్కోరు అందించారు. పాక్ బౌలర్లలో ఆయుబ్ (3/25) మూడు వికెట్లతో మాయ చేయగా.. సల్మాన్ (1/10), ఉస్మాన్ (1/24), షహీన్ షా అఫ్రిది (1/31) తలా ఓ వికెట్ పడగొట్టారు.



