నవతెలంగాణ – కాటారం
పశు సంవర్ధక, పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటారం మండలంలోని గంగారం గ్రామంలో ఆవులు, గేదెలలో గర్భస్థ వ్యాధుల నివారణకు ప్రత్యేక చికిత్స శిబిరం నిర్వహించారు. పశువులు గర్భకోష సమస్యలతో బాధపడుతున్న రైతులకు వైద్యులు ఉచిత చికిత్స అందించారు. శిబిరంలో ఆవులు, గేదెలకు ఎదకు రాకపోవడం, గర్భస్థ సమస్యలు, కట్టకపోవడం, కట్టిన తర్వాత నిలవకపోవడం వంటి సమస్యలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. దూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చి పశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ జి. రమేష్, డాక్టర్ పి. ధీరజ్, సర్పంచ్ బండం శోభ రాంరెడ్డి, గోపాలమిత్ర సూపర్వైజర్ ప్రకాశ్ రెడ్డి, గోపాలమిత్ర శ్రీనివాస్, పసుమిత్ర నజీమా, పశు వైద్య సహాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



