Wednesday, June 17, 2026
E-PAPER
Homeజాతీయండిజిటల్‌ మోసాలు రెట్టింపు

డిజిటల్‌ మోసాలు రెట్టింపు

- Advertisement -

ప్రపంచ సగటుతో పోల్చితే భారత్ లో ఆందోళకరం: ట్రాన్స్‌ యూనియన్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ లావాదేవీలు ఏటా రికార్డు స్థాయిలో విస్తరిస్తున్నప్పటికీ అదే వేగంతో సైబర్ నేరగాళ్లు కూడా విరుచుకుపడుతున్నారు. అంతర్జాతీయ క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్‌యూనియన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌‌లో డిజిటల్ మోసాల ముప్పు దాదాపు రెట్టింపు స్థాయిలో పొంచి ఉంది. గడిచిన ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన డిజిటల్ లావాదేవీలలో అనుమానాస్పద మోసాల సగటు 3.8 శాతంగా నమోదైతే.. భారత్‌‌లో ఈ రేటు ఏకంగా 7.1 శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వేగవంతమైన వృద్ధిని కనబరుస్తున్న లాజిస్టిక్స్, టెలికాం, మరియు ఇన్సూరెన్స్ రంగాలు ఈ సైబర్ మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నాయి.పరిశ్రమల వారీగా ఈ డేటాను పరిశీలిస్తే.. కొరియర్, రవాణా సేవలు అందించే లాజిస్టిక్స్ రంగం 16.3 శాతం అనుమానాస్పద మోసాల రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో టెలికాం రంగం 14.7 శాతంతో, బీమా రంగం 11.5 శాతంతో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ నిర్దిష్ట రంగాలు వెంటవెంటనే జరిగే లావాదేవీలపై, విస్తృతమైన డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్‌లపై ఆధారపడి పనిచేస్తుండటమే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. వినియోగదారుల గుర్తింపును సరిచూసే ప్రక్రియల్లో, అథెంటికేషన్ వ్యవస్థల్లో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఈ రంగాల ఖాతాల్లోకి సులభంగా చొరబడుతున్నారు.అయితే అంతర్జాతీయ ట్రెండ్‌తో పోలిస్తే భారత్‌లో సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వ్యూహం పూర్తి భిన్నంగా ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త అకౌంట్లు తెరిచేటప్పుడు మోసాలు ఎక్కువగా జరుగుతుంటే.. భారత్‌లో మాత్రం ఇప్పటికే చలామణిలో ఉన్న వినియోగదారుల ఖాతాల్లోకి లాగిన్ అయ్యే సమయంలోనే గరిష్టంగా 3.9 శాతం మోసాలు జరుగుతున్నాయి. వ్యాపార సంస్థలు, వినియోగదారులు లాగిన్ దశల్లో తమ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -