– డిటిఎఫ్ మండలాధ్యక్షుడు పూర్మా స్వామి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అల్పాహార పథకం విజయవంతం కావాలంటే పాఠశాలల పని వేళల్లో మార్పులు చేయాలని డిటిఎఫ్ మండలాధ్యక్షుడు పూర్మా స్వామి డిమాండ్ చేశారు.గురువారం నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాఠశాల సమయాల ప్రకారం విద్యార్థులకు అల్పాహారం అందించడం,అనంతరం తరగతులను సక్రమంగా నిర్వహించడం ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్నారు. అల్పాహార పథకం అమలు వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాఠశాల హాజరు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అయితే ఈ పథకం సమర్థవంతంగా అమలు కావాలంటే పాఠశాల ప్రారంభ సమయాన్ని కొంత ఆలస్యంగా చేయడం లేదా ప్రత్యేకంగా అల్పాహారం కోసం సమయం కేటాయించడం అవసరమన్నారు. విద్యార్థులు తొందరపాటుకు గురికాకుండా,ఉపాధ్యాయులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, విద్యార్థుల ప్రయాణ సమయం,పాఠశాలల మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకొని సమయాల్లో మార్పులు చేయాలని సూచించారు. అల్పాహార పథకం విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పూర్మా స్వామి పేర్కొన్నారు.



