తీవ్రంగా విమర్శించిన సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లెఫ్ట్ సర్కార్పై విషం చిమ్మేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ఇప్పటికే కేరళలో శబరిమల వివాదాన్ని తెరపైకి తెచ్చినా.. అందులో నిందితుడికి కర్నాటక కమల నేతలతో లింకులున్నట్టు తేలింది. ఇక ఇంతకు ముందే విడుదలైన కేరళ స్టోరీ ..1 వెనుక ఢిల్లీ కాషాయ నేతల హస్తం ఉన్నది. తాజాగా ప్రధాని మోడీ మొదలుకొని అమిత్షా, కేంద్ర మంత్రులందరూ కాళ్లకు బలపం కట్టుకున్న చందానా కేరళకు రాకపోకలు సాగిస్తున్నారు. కేరళలోని లెఫ్ట్ సర్కారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ఎలాగైనా కేరళను కైవసం చేసుకునేందుకు ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ను విడుదల చేశారు.
రెచ్చగొట్టే ప్రయత్నం :కేరళ సీఎం విజయన్
కేరళ లౌకిక, సమ్మిళిత సామాజిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో ది కేరళ స్టోరీ 2 సినిమాను విడుదల చేశారనే విషయం సున్నితంగా గమనిస్తే తెలుస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది రెచ్చగొట్టే ప్రయత్నమని తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ పోస్ట్లో…కేరళ ఇప్పటికే మతపరమైన ఎజెండాను , సినిమా మొదటి భాగంలో వ్యాపించిన స్పష్టమైన అబద్ధాల ను తిరస్కరించిందని, రాష్ట్రాన్ని రాక్షసంగా చూపించే ప్రయత్నాలను మరోసారి వ్యతిరేకిస్తుందని అన్నారు.
మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే లక్ష్యంతో రూపొందించిన కథనాలకు స్వేచ్ఛ లభించడం దిగ్భ్రాంతికరమని, విమర్శనాత్మక కళాత్మక వ్యక్తీకరణలు తరచుగా నిశ్శబ్దం చేయబడతాయని ఆయన తెలిపారు. ”మన సామరస్య భూమిని ఉగ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడాలి. నిజం ఎల్లప్పుడూ గెలుస్తుంది” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోస్ట్లో పేర్కొన్నారు. రాబోయే సీక్వెల్పై ఆయన ఇంతకు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి చిత్రం.. కేరళపై ద్వేషాన్ని వ్యాప్తి చేసే, కేరళ ప్రజల దీర్ఘకాల లౌకిక సంప్రదాయాన్ని బలహీనపరిచే ఉద్దేశంతో రెండవది రూపొందించబడిందని పేర్కొన్నారు.



