ఐపీఎల్ ప్రాంఛైజీలు మంచి ఆటగాడితో పాటు జట్టుకు విలువ జోడించగల, స్టేడియానికి అభిమానులను పోటెత్తించగల స్టార్డమ్, సత్తా ఉన్న క్రికెటర్ను కొనుగోలు చేసేందుకు ఎల్లప్పుడూ మొగ్గుచూపుతాయి. ఆ కోవలోకి వచ్చే ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడు. అందుకే, కారు ప్రమాదం నుంచి బయటపడి వచ్చినా రిషబ్ పంత్ వేలంలో రూ.27 కోట్లు దక్కించుకున్నాడు. ఐపీఎల్ వేలంలో ఇదే ఇప్పటివరకు అత్యధిక ధర. కానీ, వరుస సీజన్లలో వైఫల్యం పంత్ విలువను తగ్గించేసింది. ఏకంగా రూ.12 కోట్ల తక్కువ ధరకే రిషబ్ పంత్ పాత ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు మారిపోయాడు.
ఢిల్లీ క్యాపిటల్స్కు మారిన రిషబ్ పంత్
లక్నో సూపర్జెయింట్స్కు కుల్దీప్
కీలక ఆటగాళ్ల ట్రేడింగ్ విజయవంతం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట కీలక ఆటగాళ్ల ట్రేడింగ్కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్కు ముందే, లక్నో సూపర్ జెయింట్స్ సారథ్య పగ్గాలు వదిలేసిన రిషబ్ పంత్.. ట్రేడింగ్లో జట్టు మారేందుకు సైతం సుముఖత వ్యక్తం చేశాడు. రూ.27 కోట్ల రికార్డు ధరకు రిషబ్ పంత్ను 2025 ఆటగాళ్ల వేలంలో కొనుగోలు చేసిన లక్నో సూపర్జెయింట్స్ పంత్ను ట్రేడ్ చేసేందుకు ప్రాంఛైజీలకు ఆఫర్ చేసింది. ఢిల్లీ క్యాపిటిల్స్తో పాటు ఐపీఎల్ టైటిల్ను రెండు కంటే ఎక్కువ సార్లు నెగ్గిన ప్రాంఛైజీ సైతం పంత్ను తీసుకునేందుకు ప్రయత్నించింది. చివరగా, ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్జెయింట్స్తో ఒప్పందం ఖరారు చేసుకుంది. రూ.15 కోట్లకు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు మారనుండగా.. పంత్కు బదులుగా కుల్దీప్ యాదవ్ను లక్నో సూపర్జెయింట్స్ తీసుకుంది. కుల్దీప్ యాదవ్ రూ.13.50 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అందుకోగా.. అదే ధరకు లక్నో సూపర్జెయింట్స్కు మారాడు. రిషబ్ పంత్ను ట్రేడ్ చేసిన లక్నో సూపర్జెయింట్స్ రూ.27 కోట్ల వేలం పర్సును మిగిల్చుకుంది. కుల్దీప్ యాదవ్ను రూ.13.5 కోట్లకు తీసుకోవటంలో… లక్నో సూపర్జెయింట్స్ వద్ద మరో రూ.13.5 కోట్ల వేలం పర్సు మిగిలి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ యాదవ్ను ట్రేడ్ చేసి రూ.13.50 కోట్లను మిగిల్చుకోగా.. రిషబ్ పంత్ను తీసుకోవటంతో మరో రూ.1.50 కోట్ల వేలం పర్సును కోల్పోయింది.
తగ్గిన రిషబ్ పంత్
రిషత్ పంత్ 2016లో ఐపీఎల్ కెరీర్ ఢిల్లీ డేర్డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్ పాత పేరు) నుంచి మొదలెట్టాడు. 2024 సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫునే ఆడాడు. కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన ఏడాది శ్రేయస్ అయ్యర్ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరించి ఆ సీజన్లో ఫైనల్కు తీసుకెళ్లాడు. అయినా, క్యాపిటిల్స్ యాజమాన్యం పంత్ వైపు మొగ్గుచూపించింది. క్యాపిటల్స్ యాజమాన్యంలో పార్థ్ జిందాల్ వ్యక్తిగతంగా పంత్కు అభిమాని. అయినా, వేలంలోకి వచ్చిన పంత్ రికార్డు ధర దక్కించుకున్నాడు. రూ.23 కోట్ల వరకు క్యాపిటల్స్ సైతం పంత్ కోసం ప్రయత్నం చేసింది. రికార్డు ధర ఒత్తిడి, జట్టును నడిపించటంలో ఆందోళన, విపరీత అంచనాలు, సత్వర సక్సెస్ కోరుకునే ప్రాంఛైజీ.. ఇలా పలు అంశాలను రిషబ్ పంత్పై ప్రతికూల ప్రభావం చూపించాయి. రెండు సీజన్లలో పంత్ ఆటగాడిగా, కెప్టెన్గా నిరాశపరిచాడు. ఫలితంగా, ఈ ఏడాది ప్లే ఆఫ్స్కు లక్నో అర్హత సాధించలేదు. దీంతో కెప్టెన్సీ పగ్గాలను పంత్ త్యజించాడు. ఆ తర్వాత ఆటగాళ్ల ట్రేడింగ్ చర్చల్లో పంత్ కేవలం రూ.15 కోట్లు దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజాను చెన్నై సూపర్కింగ్స్ 2022లో రూ.18 కోట్లకు అట్టిపెట్టుకోగా.. 2026 ఐపీఎల్ సీజన్ ముంగిట రూ.14 కోట్లకు రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. వేలంలో దక్కించుకున్న ధర తగ్గించుకుని వేరే ప్రాంఛైజీకి ట్రేడ్ కావటం ఐపీఎల్లో ఇది రెండోసారి.
మాకు సంతోషమే!
రిషబ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్కు రావటంపై ఆ ప్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘గత ఐదేండ్లుగా నువ్వు చేసిన సేవలకు ధన్యవాదాలు కుల్దీప్. ఈ ఐదేండ్లలో కోర్ జట్టులో భాగమయ్యావు, జట్టు నిన్ను మిస్ అవుతుంది. నువ్వో చాంపియన్ ప్లేయర్, సొంత మైదానంలో గొప్పగా రాణిస్తావని ఆశిస్తున్నాను. రిషబ్ పంత్.. నువ్వు మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్కు రావటం పట్ల నేను, కిరణ్ ఎంతో సంతోషంగా ఉన్నాం. సొంతగడ్డ ఢిల్లీలో మళ్లీ నువు ఫామ్ అందుకుంటావని అనుకుంటున్నాం’ అని పార్థ్ జిందాల్ ఎక్స్లో ట్వీట్ చేశాడు.



