ఇప్పటివరకు ఐదు కథ సంపుటాలు వెలువరించిన వేంపల్లి గంగాధర్, ఇప్పుడు తీసుకొచ్చిన సరికొత్త కథా సంపుటమే ”గంగమ్మ పూలు”. ఇందులో సగం కథలు పోలీసు హింస- దోపిడిని చిత్రించగా, మిగతా సగం కథలు దారిద్రాన్ని- బతకలేనితనాన్ని చిత్రించాయి.
ఎర్ర చందనం చెట్లను కొట్టడానికి వచ్చి పట్టుబడిన ”తమిళ కూలి”, దొరికిన వజ్రాన్ని కాజేయడానికి ఒక గ్రామస్తుడిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు, దళారీల మాట విని గసగసాల పంట వేసిన గ్రామస్తులు పోలీస్ హెచ్చరికలతో అప్రమత్తం కావడం, రైళ్లలో అమ్ముకునే వారి మీద రైల్వే పోలీసులు చేసే దోపిడీ- హింసను కొన్ని కథలు చిత్రించాయి. రాగి తీగల కోసం ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టే దొంగల వల్ల బీద రైతుల కష్టాలు, ఆడపిల్లల బీదరికాన్ని ఆసరా చేసుకుని వారిని రికార్డింగ్ డాన్సర్లుగా చివరకు వారిని వ్యభిచారిణులుగా మార్చే ఒక విష వలయాన్ని తెలియజేశారు.
బొగ్గుల బట్టీ పెట్టుకుంటే అటు అటవీ అధికారుల దౌర్జన్యం, ఇటు యజమాని కర్కశత్వం వాడిని దిక్కుతోచనీయకుండా చేస్తుంది. బాగా చదువుకునే పిల్లాడిని చదువు మాన్పించి తన వెంట బ్యాండ్ మేళంలో తిప్పుకునే తండ్రిని ఎదిరించిన తల్లి ఒక కథలో కనిపిస్తుంది. మంచితనం, మానవత్వంతో కూడిన ఆదర్శవాద ధోరణులతో కూడిన కథలు కూడా ఇందులో ఉండడం విశేషమే. స్థానీయతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ కథలో మరింత సహజంగా రూపొందాయి.
- కె.పి.అశోక్ కుమార్ 9700000948



