Wednesday, February 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేటాయింపులు ఘనం.. వ్యయం సగం

కేటాయింపులు ఘనం.. వ్యయం సగం

- Advertisement -

బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ సర్కారు ..బడ్జెట్‌లో ఖర్చయింది 50 శాతమే..
నిధుల్లేకపోయినా భారీగా అంచనాలు
ఆ తర్వాత చేతులెత్తేస్తున్న వైనం
ప్రతిష్టాత్మక పథకాలకు నిధుల లేమి
‘బడ్జెట్‌’ ముంగిట సవాళ్లెన్నో

బి.వి.యన్‌.పద్మరాజు
‘మనం పేదలకు న్యాయం చేస్తున్నామా? లేదా? అనేది మన విధానాలు, వాటి తాలూకూ ప్రాధాన్యతలు నిర్ణయిస్తాయి…’ అంటారు సామాజిక, ఆర్థికవేత్తలు. ఈ సూత్రం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వాల ప్రాధాన్యతలు నానాటికీ మారిపోతున్నాయని చెప్పక తప్పదు. బడ్జెట్లు, వివిధ రంగాలకు కేటాయింపుల్లో అప్పుడూ, ఇప్పుడూ ఆరంభ శూరత్వమే కనబడుతోంది తప్ప ఆచరణలో కేటాయింపులు, ఖర్చుకు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా కనబడుతోంది. 2025-26 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమశాఖకు రూ.3 వేల కోట్లను కేటాయించి, అందులో కేవలం రూ.1,300 కోట్లే ఖర్చు చేయటాన్నిబట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో నాలుగు వారాల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ శాఖకు రావాల్సిన రూ.1,700 కోట్లు ‘అంతే సంగతులు…’ అంటున్నారు ఉన్నతాధికారులు. పంచాయతీరాజ్‌ శాఖ కేటాయింపులు, ఖర్చుది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇదే రకంగా మొత్తం బడ్జెట్‌లో అన్ని శాఖలు, రంగాలకు కలిపి ఇప్పటి వరకు 50 శాతానికి మించి ఖర్చు చేయలేదని సమాచారం.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు లేకపోయినా ఏడాదికేడాది పద్దులు, అంచనాలు పెంచుకుంటూ పోవటం ప్రభుత్వాలకు రివాజుగా మారింది. ప్రతీయేటా బడ్జెట్‌ సమయంలో కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించి, వాటికి భారీ స్థాయిలో కేటాయింపులు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత నిధుల్లేక వాటిని పక్కనపడేయటం షరామామూలై పోయింది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో రూ.2,91,059 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. అయితే ఆ ఏడాది అంత మొత్తంలో ఆదాయం రాకపోవటంతో సవరించిన అంచనాల ప్రకారం రూ.2,66,708 కోట్ల వచ్చాయంటూ ప్రకటించింది. అదే ఏడాది రెవెన్యూ రశీదుల ద్వారా రూ.2,21,242 కోట్లు వస్తాయని అంచనా వేసుకోగా అందులో 2025 మార్చి నాటికి రూ.1,67,804 కోట్లే ఖజానాకు చేరాయి. ఇది మొత్తం అంచనాల్లో 75 శాతంగా నమోదైంది. అంటే ప్రభుత్వం వేసుకున్న అంచనాల్లో 25 శాతం ఆదాయం రాలేదన్నమాట. ఈ వాస్తవాన్ని పెడచెవిన పెట్టిన సర్కార్‌ 2025-26 బడ్జెట్‌లో రెవెన్యూ రశీదుల అంచనాలను మళ్లీ పెంచి చూపింది. ఆ రూపంలో మొత్తం రూ.2,29,720 కోట్లు వస్తాయని పద్దులో పేర్కొంది. కానీ ఈ యేడాది జనవరి నాటికి రెవెన్యూ రశీదుల రూపంలో రూ.1,38,371 కోట్ల ఆదాయమే వచ్చింది. ఇది
కేటాయింపులు ఘనం.. వ్యయం సగం..మొత్తం అంచనాల్లో 60 శాతంగా నమోదైంది. మిగిలిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిగతా 40 శాతం ఆదాయం రావటం డౌటే.

వీటి పరిస్థితేంటో…?
రాష్ట్ర ప్రభుత్వం గత (2025-26) బడ్జెట్‌ను రూ.3.04 లక్షల కోట్లతో భారీ స్థాయిలో ప్రవేశపెట్టింది. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… ఆ రంగానికి రికార్డు స్థాయిలో రూ.1.04 లక్షల కోట్లు, ఆరు గ్యారెంటీల అమలుకు మరో రూ.56 వేల కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్లు, విద్యుత్‌ రాయితీలు, రైతు భరోసా పథకాలకు నిధులను పెంచుతామని హామీనిచ్చారు. కానీ రూ.8.50 లక్షల కోట్ల అప్పు ప్రభుత్వం నెత్తిమీద భారంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వడ్డీ కింద రూ.24,085 కోట్లను చెల్లించారు. దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలు నత్తనడకన సాగుతోంది. ఇటీవల ఓ ఉన్నతాధికారితో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు…’అధికార పార్టీ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ఇచ్చిన ఊపులో ఉంది. ఈ ఊపుతో వచ్చే బడ్జెట్‌లో కొత్త స్కీములు ఏమైనా ప్రవేశపెడతారా?’ అని అడగ్గా…’ఇప్పుడున్న వాటిని సరిగ్గా నిర్వహిస్తే చాలు.. కొత్త వాటి సంగతి దేవుడెరుగు…’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. అలాంటప్పుడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పింఛన్ల పెంపు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అమ్మాయిలకు స్కూటీలు, తులం బంగారం… తదితర పథకాలు ఎప్పుడు అమలవుతున్నాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -