” సప్పగా సాగిన పరకాల మున్సిపల్ సమావేశం
ప్రణాళిక లేని సమావేశాలు ఎందుకంటూ
పెదవి తీరుస్తున్న పట్టణ ప్రజలు
నవతెలంగాణ – పరకాల
పరకాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం ఎటువంటి కీలక నిర్ణయాలు, అర్థవంతమైన చర్చలు లేకుండానే సప్పగా ముగిసింది. నగర అభివృద్ధిపై సభ్యులు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పటికీ, వాటికి సరైన ప్రాధాన్యత దక్కలేదని, కేవలం తూతూ మంత్రంగానే సమావేశం సాగిందని పలువురు కౌన్సిలర్లే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
- నిధుల వినియోగంపై అస్పష్టత
- పట్టణ సుందరీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం ‘తపెట్కో’ నుంచి ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ నిధులు మంజూరు అయినట్లు సమాచారం. అయితే, ఇంత పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉన్నా, వాటి ఖర్చు, కార్యాచరణపై కనీస చర్చ జరగకపోవడం కౌన్సిలర్ సమావేశాల పట్ల నమ్మకాన్ని సన్ఝగిల్లేలా చేస్తుందని పలువురు వాక్యానిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రాధాన్యతను నిర్ణయించడంలో అధికారులు, పాలకవర్గం విఫలమైందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి
- ప్రణాళికలో లోపమా..? సభ్యులకు అవగాహన లేకనా..?
- వచ్చే మూడు నెలలకు సంబంధించి రూపొందించాల్సిన అభివృద్ధి ప్రణాళికపై కౌన్సిల్ సభ్యులకు సరైన అవగాహన ఉందా..? లేదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లేకపోవడంతో సమస్యలు అలాగే పేరుకుపోతున్నాయి. కౌన్సిల్ సమావేశం అంటేనే పట్టణ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపాందుతాయని ఆశిస్తుంటారు. కానీ పరకాల కౌన్సిల్ సమావేశం తూతూ మంత్రంగా సాగి ప్రజల ఆశలను నీరుగార్చాయని పలువురు భావిస్తున్నారు.
- ప్రస్తావనకే పరిమితమైన సమస్యలు
- సమావేశంలో స్వచ్ఛ ఆటోల కొనుగోళ్లలో ధరల వ్యత్యాసం, 19వ వార్డులో మెయిన్ రోడ్డు డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోవడం, మార్కెట్ రోడ్డులో ఆక్రమణలు, పశువుల సంత వేలంలో పారదర్శకత లోపం, మరియు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణలో అవకతవకల వంటి కీలక అంశాలను కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణాచారి, కుక్కల విజయ్, దుబాసి వెంకటస్వామి తదితరులు లేవనెత్తారు. కానీ, అధికారులు ఈ సమస్యలపై సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో, ఆ చర్చలన్నీ కేవలం ప్రస్తావనలకే పరిమితమయ్యాయి.
పట్టణ అభివృద్ధికి నిధులు ఉన్నా, వాటిని సద్వినియోగం చేయడంలో పాలకవర్గం చూపుతున్న నిర్లక్ష్యంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి సమావేశంలోనైనా సమస్యలపై గట్టిగా చర్చించి, అభివృద్ధిని పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి.



