– రైతు ఫిర్యాదుతో నిఘా
– రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేటలోని ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎల్. శ్రీనివాస్ను రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి తన వ్యవసాయ భూమికి మట్టి తరలించేందుకు అనుమతి కోరిన ఓ రైతు వద్ద నుంచి ఏఈఈ శ్రీనివాస్ రూ.4 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు రైతు సోమవారం అశ్వారావుపేటలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఏఈఈ శ్రీనివాస్కు రూ.2 లక్షలు అందజేస్తుండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఫిర్యాదు చేసిన ఇదే రైతు గతంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారిని కూడా ఏసీబీకి పట్టించినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.



