నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రైతంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80 వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా వారి దౌర్జన్యాలను నిరసిస్తూ సాగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య అమరుడయ్యారని. ఆయన ఆమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం 4000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, పేద ప్రజలు అమరులయ్యారని, ఈ పోరాటంలో పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచటం జరిగిందని, ఈ పోరాటంలో అన్ని కులాల అన్ని మతాల పేదలు ఐక్యంగా పాల్గొన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ, అమరుల త్యాగాన్ని కించపరుస్తున్నారని వారు అన్నారు. నేటి బిజెపి ప్రభుత్వం మతాల మధ్య , కులాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి వాటితో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని. హిందువుల మనోభావాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని వారి భావోద్వేగాలే కాకుండా, అయోధ్యలో 2000 కోట్ల అవినీతి జరిగినా దాని గురించి ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని, ఇది ఏ రకంగా రాజ్యాంగ పరిరక్షణ అవు తుందో ప్రజలు ఆలోచించాలని, అందువల్ల రాబోయే కాలంలో దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యల పైన అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు అనసూయమ్మ , శంషాద్దీన్, ఉద్ధవ్, దీపిక, సుచిత్, చక్రి,తదితరులు పాల్గొన్నారు.



