– 8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు
– సమ్మెకు సీఐటీయూ, వ్యకాస సంఘాల నాయకుల సంఘీభావం
నవతెలంగాణ-సత్తుపల్లి
సింగరేణిలోఎగ్జిక్యూటివ్ అధికారుల సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ‘పే అప్గ్రేడేషన్ను, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే’లను వెంటనే అమలు చేయాలని, నిలిపివేసిన బకాయిలను ఆలస్యం చేయకుండా తక్షణమే చెల్లించాలని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) సత్తుపల్లి శాఖ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం సింగరేణి అధికారులు జీఎం కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో డీజీఎం (ఈ అండ్ ఎం) కిష్టారం ఓసీపీకి చెందిన జీవీ రావు, ఈఈ (ఈ అండ్ ఎం) జేవీఆర్ ఓసీపీకి చెందిన కె. జగదీష్, సీహెచ్పీకి చెందిన జి. శ్రీనివాస్, ఓసీపీకి చెందిన మహమ్మద్ జహీద్ కూర్చున్నారు.
అధికారుల దీక్షలకు సీఐటీయూ, వ్యకాస నాయకుల సంఘీభావం
సమస్యల సాధన కోసం సింగరేణి అధికారులు చేపట్టిన నిరవధిక దీక్షల శిబిరాన్ని సీఐటీయూ, వ్యకాస నాయకులు సందర్శించి ఆయా సంఘాల తరపున సంఘీభావాన్ని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విటల్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, వ్యవసాయ కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు, నాయకులు చెరుకు శ్రీనివాసరావు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ అధికారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.



