”జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను నాశనం చేశారు. ఇక ఈ దేశంలో ఒక్క గాల్ కోటియాస్ యూనివర్సిటీ మాత్రమే ఉంటుంది!” అని ప్రసిద్ధ చరిత్ర కారుడు ఎస్.ఇర్ఫాన్ హబీబ్ అన్నారు. ”మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఎఐ) సమ్మిట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ వారు నగ్నంగా ప్రదర్శనలిచ్చారు. ఆసలు కాంగ్రెస్ పార్టీయే దేశంలో నగ్నంగా నిలబడింది. ఇంకా నగ్న ప్రదర్శనలెందుకూ?” అని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. నిజానికి దేశం పరువు కాంగ్రెస్ యువకార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన వల్ల పోయిందానేకంటే- చైనా నుండి కొనుక్కొచ్చిన రోబోడాగ్ వల్ల పోయింది. పైగా రూ.350 కోట్లతో తాము ఇక్కడే దాన్ని తయారు చేశామని చెప్పుకోవడంవల్ల పోయింది.
అత్యుత్తమస్థాయి గల ప్రయివేట్ యూనివర్సిటీ అని గతంలో అవార్డు ఇచ్చిన గల్ గోటియాస్ యూనివర్సిటీని తక్షణం ప్రాంగణం నుండి ఖాళీ చేయించినందు వల్ల పోయింది. దేశ విదేశీ ప్రతినిధులను బయట ఎండలో నిలబెట్టి, ప్రధాని మోడీ ఒక్కడే లోపల ఉండి ఫొటో షూట్-వీడియో షూట్ చేయించుకున్నందువల్ల పోయింది. ఇంటర్నెట్ సౌకర్యం లేక, క్యాబ్లు బుక్గాక, మైళ్ల దూరం ప్రతినిధులు నడవాల్సి వచ్చినందువల్ల పోయింది. ఎఐ సమ్మిట్ విఫలమై ప్రపంచదేశాల ముందు అభాసుపాలు కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం! వేరెవరో వచ్చి కేంద్ర ప్రభుత్వపు పరువుతీసే అవకాశమే లేదు. కారణం, ఆ పనివారికి వారే చేసుకోగలరని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ రుజువు చేసింది. పన్నెండేళ్లుగా వేలవేల తప్పులు జరుగుతున్నా, ఏ ఒక్కదానికీ ప్రభుత్వం వారు ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోలేదు. ముందు అది గుర్తుంచుకోవడం అవసరం!
యూనివర్సిటీల్లో ఇతర విద్యాసంస్థల్లో భూతవైద్యం, కర్మకాండల డిప్లమా కోర్సులు ప్రవేశపెట్టి – భగవద్గీత పాఠ్యగ్రంథం చేసుకుంటే, ఇక ఎఐ సమ్మిట్లో చైనా రోబోడాగ్ను ప్రదర్శించుకోకపోతే మరింకేం ప్రదర్శించుకోగలరూ? ఆత్మల్ని, పరమాత్మల్ని తెచ్చి చూపలేరు కదా? స్వతహాగా ఏదైనా తయారు చేయాలంటే కాస్త సైన్సు తెలిసుండాలి కదా? వేదాలు, మనుస్మృతి ఇక్కడ పనికి రావు కదా? చైనాలో తయారైన రోబోను తెచ్చి, ఎఐ సమ్మిట్లో డాబుగా ప్రదర్శించి, అది తామే తయారు చేశామని చెప్పుకున్న గాల్గోటియాస్ యూనివర్సిటీ రీసర్చ్ అండ్ ఎనాలిసిస్ హెడ్ మరెవరో కాదు- సంబిత్ పాత్ర! ఈయన ఆవుపేడ కోహినూర్ వజ్రం కన్నా గొప్పదని చెప్పిన గొప్ప మేధావి!
ఒరిస్సా బీజేపీ ఎంపీ. అడ్డదిడ్డంగా మాట్లాడడంలో ఆరితేరిన ఘనుడిగా, ఈ దేశ ప్రజలకు బాగా పరిచయం ఉన్నవాడే! చైనాలో తయారు చేయించి, తమదిగా చెప్పుకోవడం ఈ బీజేపీ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. గుజరాత్ వాడైనందుకు నెహ్రూ మంత్రి వర్గంలో ఉన్న కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభారు పటేల్ విగ్రహం సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర ప్రతిష్టించారు. సరోవర్ ప్రాజెక్ట్ ప్రారంభించింది – నెహ్రూ. ‘మేకిన్ ఇండియా’- అని చెప్పే వీరు రూ.3500 కోట్లు చైనా సాంకేతిక నిపుణులకు ధారపోసి పటేల్ విగ్రహం తయారు చేయించారు. చెప్పే దానికి, చేసేదానికి పొంతన లేకుండా వీరు జాగ్రత్త పడుతుంటారన్నమాట!
హిందుత్వ ముసుగులో ఆరెస్సెస్, ఏబీవీపీలు కలిసి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో కాషాయ జెండా లెగరేసి, కర్రసాము కవాతు కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రశ్నించిన వామపక్ష విద్యార్థి సంఘం సభ్యులపై అమానుషంగా దాడులు చేశాయి. ఇలాంటి కార్యక్రమాల్ని ఎక్కడికక్కడ దేశంలో ఆపకపోతే విశ్వవిద్యాలయాలకూ, విద్యా వ్యవస్థకూ చాలా ప్రమాదం. మోడీ ప్రభుత్వపు చంకలో చేరిన ఉతకర్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవి కనిపిస్తున్నాయో లేదో. ఈ విషయం విస్మరించి కేంద్రమంత్రి కప్ప గంతుల సింథియాతో డాక్ సేవక్ సమ్మేళనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందంగా పాల్గొనడం ఇటు రాష్ట్ర పౌరులకూ అటు దేశపారులకూ కూడా చిరాకు తెప్పించిన విషయం! ”మహాత్మాగాంధీ తన ఆత్మ కథకు ‘మై ఎక్స్పర్మెంట్ విత్ ట్రూత్’ అని పేరుపెట్టారు.
ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ తన ఆత్మకథకు ‘మై ఎక్స్పర్మెంట్ విత్ లైస్’ – అని పేరు పెట్టాల్సి ఉంది” అని అన్నారు రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత. ”మోడీజీ మీరు ప్రధానిగా అధికారంలో ఉన్నన్ని రోజులు నెహ్రూజీ దేశ స్వాతంత్య్రం కోసం జైల్లో ఉన్నారు. ముందు ఆ విషయం తెలుసుకోండి! స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని వారికి నెహ్రను విమర్శించే హక్కు కాదు గదా – నెహ్రూ పేరు ఉచ్చరించే అర్హతే ఉండదు” అని పార్లమెంట్ నిండుసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఉపన్యసిస్తూ ఉంటే మోడి ముఖం మాడిపోయింది. ఆయన వంధిమాగదులకు తలెత్తిచూసే ధైర్యం కూడా లేకుండా పోయింది. నిజానికున్న బలం అది! డెబ్బయి ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని పార్లమెంట్లో బీజేపీ సభ్యులు పదేపదే ప్రశ్నిస్తుంటారు.
కాంగ్రెస్ నేతలు లేచి చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు అయితే, ఒకసారి వెనక నుండి ఒక గొంతు గట్టిగా వినిపించింది. ”వద్దు! వద్దు- చెప్పకండి!! కాంగ్రెస్ ఏమేం స్థాపించిందో తెలుసుకుని ఈ ప్రభుత్వం ఒక్కొక్కటి అమ్మేస్తూ వస్తోంది. ఇకచాలు- చెప్పడం ఆపండి! ఇంకా చెబితే, అవి కూడా తెలుసుకుని ఇంకా ఇంకా అమ్మేస్తుంది లేదా అదానీకి ఇచ్చేస్తుంది”- అనే మాటలు వినిపించాయి. ఇది హాస్యోక్తి కాదు. వాస్తవంగా అక్కడ జరుగుతూ ఉన్న విషయం. సమాధానం చెప్పాల్సిన టైంకు ప్రధాని మోడీ సభ నుండి పారిపోతారు. ఇటీవల బడ్జెట్ పై చర్చ జరుగుతూ ఉంటే, మోడీ లేచి ‘నెహ్రూ కుటుంబం గాంధీ ఇంటిపేరును చోరీ చేసిందని’ మాట్లాడాడు. చరిత్ర తెలుసుకున్న వారికి విషయాలు తెలుస్తాయి.
దొంగడిగ్రీ పుట్టించుకొచ్చి దబాయించే వారికేం తెలుస్తాయి? పార్లమెంటులో ఆయన సీటు చుట్టూ పార్లమెంట్ సభ్యులు గుమిగూడితే – తన మీద దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పుకున్న ప్రధాని అంత పిరికివాడా? అంత భయంగా ఉంటే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? ఈయన పోతే ఇంతటి అబద్ధాలకోరు, డ్రామా ఆర్టిస్టు మరొకరు దొరకరని బీజేపీ, ఆరెస్సెస్ భావిస్తోందేమో – ఏమో – పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ పెద్దనోట్లరద్దు ప్రసక్తి తీసుకురాగానే, స్పీకర్ ఓంబిర్లా కలగజేసుకుని ”ఆపేయండి! అది ఇప్పటి సంగతి కాదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల నాడు జరిగింది” అన్నాడు విసురుగా. అభిషేక్ బెనర్జీ సమయ స్ఫూర్తితో వెంటనే అందుకుని ”స్పీకర్ సర్! ఎమర్జెన్సీ మరి ఇప్పటిదా? 50 ఏళ్ల నాటిది కదా? అధికార పార్టీ సభ్యులు ఎందుకు గొంతు చించుకుంటున్నారూ? ఈమాటే మీరు వారికెందుకు చెప్పలేదూ?” అన్నాడు.
ఓం బిర్లా ముఖం మాడి మసిబొగ్గయ్యింది. అభిషేక్ బెనర్జీ పార్లమెంట్లో మరో సందర్భంలో మరో విషయం కూడా లేవనెత్తారు. ”ఒక సామానుడి ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టగానే ఈ బీజేపీ ప్రభుత్వం డైపర్లపై పన్ను వేస్తుంది. అతను కొంచెం పెరగగానే చదువుపై పన్ను – చదువు పూర్తి చేసుకుని ఏ దైనా పనికోసం వెళితే ఇంధనంపై పన్ను, ఉద్యోగం సంపాదించుకుంటే, ఆదాయంపై పన్ను- సంపాదించుకున్న దాంట్లో నానా తంటాలు పడి ఏదో ఇంత పొదుపు చేసుకుంటే, మళ్లీ ఆ పొదుపుపై పన్ను – భవిష్యత్తు కోసం బీమా చేసుకుంటే, మళ్లీ దానిమీద కూడా పన్ను – ఈ ప్రభుత్వ హయాంలో సామాన్యుడు బతికే అవకాశాలు ఎక్కడున్నాయి?” అని ప్రశ్నించాడు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముఖం చాటేసిందా? దేశ ప్రజలకు సరైన సమాధానమిచ్చిందా? ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ఇక ప్రధానైతే ఇలాంటి ప్రశ్నలు ఎక్కడ వినబడతాయోనని.. పి.టి. ఉష కన్నా వేగంగా లోకసభ నుండి పారిపోతుం టారు?
ఉత్తరప్రదేశ్ అలీగడ్లోని అనేక దేవాలయాలపై ”ఐ లవ్ మహ్మద్” అని రాతలు కనిపించాయి. పోలీసుల దర్యాప్తు లో అలా రాసిన ఫారంతా హిందువులేనని తేలింది. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తమ దేవాలయాలపై తామే రాసుకుని, నింద మరోమతం వారిపై వేయాలని, ద్వేషభావం పెంచాలని కొందరి కుట్ర దారుల పన్నాగం. ఉగ్రవాదులంటే ఎవరో కాదు, ఇదిగో ఇలాంటి వారేనని జనం అనుకున్నారు. ”నోబెల్ ప్రైయిజ్ గెలుచు కున్న మేధావికున్నంత స్వేచ్ఛ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక మూర్ఖుడికి కూడా దొరుకుతూ ఉంది” అని అన్నారు ఇటాలియన్ రచయిత, తత్వవేత్త ఉంబర్టో ఇకో. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ‘పాలకూట విషం’ కేసులో ఆరుగురు చనిపోతే, పోలీసులు గణేష్ అనే పాల వ్యాపారిని అరెస్ట్ చేశారు.
ఆ విషయాన్ని ఎలా మలుపు తిప్పుదామా అని అంధభక్తులు కొందరు ”అరెస్ట్ అయినవాడు గణేష్ కాదు, గఫూర్” అని అబద్ధ ప్రచారానికి పూనుకున్నారు. తమ ఢిల్లీ నేతలు తన్మయులైపోతారని వీరికి తెలుసు! సావర్కర్కు భారతరత్న ఇవ్వాలని ఆరెన్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తావించడంపై కంగనారనౌత్ పత్రికల వారితో తన అభిప్రాయం పంచుకున్నారు. ”వీర్ సావర్కర్ భారతరత్న కన్నా ఇంకా పెద్ద పురస్కారానికి అర్హులు. కానీ, కనీసం భారతరత్న ఇచ్చినా ఈ దేశప్రజలు సంతోషిస్తారు” అని! ప్రజల పక్షాన మాట్లాడే అర్హత తనకు ఉందా లేదా అన్నది మాత్రం ఆమె ఆలోచించుకోలేదు. అసలు విషయమేమంటే ఒక్క నిజం చెప్పి యాభై మంది మేధావుల నోరు మూయించొచ్చు. కానీ, యాభై నిజాలు చెప్పినా ఒక్క మూర్ఖుడు కూడా నోరు మూయడు!
గత మూడేళ్లలో ఎస్బీఐ సామాన్య ఖాతాదారుల నుండి ఎనిమిది వేల కోట్లు ‘పెనాల్టీగా’ వసూలు చేసింది. కారణం మినిమం బాలెన్స్ లేనందుకు వేసిన జరిమానా అది! ఇది పేదలను దోచుకోవడం కాదా? ఉన్నోడికి రుణాలు మాఫీ అవుతాయి. లేనోడి ఎకౌంట్లో మినిమం బాలెన్స్ లేదని ఫైన్ విధించడం సబబుగా ఉందా? ఈ ప్రభుత్వం కార్పొరేట్లను తప్ప సామాన్యుల్ని ఊపిరి కూడా పీల్చుకోనిచ్చేట్లు లేదు. సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాధ్యులు ఎవరు? విదేశీ రుణం 2025లో 64 లక్షల కోట్లు – అంటే అప్పులు పదిశాతం పెరిగాయి. తగ్గిన బంగారు నిలువుల విలువ 14.2 బిలియన్ డాలర్లు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 92 దాటింది. తగ్గిన విదేశీ కరెన్సీ నిలువలు 6.7బిలియన్ డాలర్లు. ప్రధాన మంత్రి కార్యాలయం లోక్సభా సెక్రటేరియట్కు ఇలా చెప్పింది – ”పి.యం కేర్స్/ పి.యం. రిలీఫ్ ఫండ్/ డిఫెన్స్ ఫండ్పై సభలో ఎటువంటి ప్రశ్నలు అనుమతించవద్దు!” -ఇదేం విచిత్రం? ప్రజల నుండి సేకరించిన నిధులకు లెక్కలు ప్రజలకు చెప్పేపని లేదా? ఇదేం బీజేపీ రామరాజ్యం?
ప్రజాచైతన్యం పెల్లుబికి ఈ అంధభక్తులను కంట్రోల్ చేయకపోతే, ఒకప్పుడు చెట్లకు ఆకులు కాషాయం రంగులో ఉండేవి. ముస్లిం రాజులొచ్చి వాటిని ఆకుపచ్చరంగులోకి మార్చారు – అని చెప్పినా చెపుతారు. వారి ఐటి సెల్తో ప్రచారం కూడా చేయిస్తారు. ”మీకు అంతా పచ్చగా ఉండాలంటే పాకిస్థాన్ వెళ్లిపొండి. ఈ దేశంలో ఉండేది కాషాయమే! మిగతా రంగులకు స్థానం లేదు” అని అన్నారు నవనీత్ రాణా. ఈమె బీజేపీ నాయకురాలు. ప్రకృతి అంతా పచ్చగానే ఉంటుంది. అది లేకపోతే తిండి, బట్ట, గూడు ఉండవని తెలుసుకో తల్లీ!” – అని అనుకుంటున్నారు ఈ దేశ ప్రజలు.
నేషనల్ బుక్ ట్రస్ట్ పూర్వ సలహా సంఘ సభ్యులు, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



