విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం !
కనీస వసతులు లేక విద్యార్థుల విలవిల
80శాతం అధ్యాపక పోస్టులు ఖాళీ..
అక్రమాల్లో కొందరు ప్రొఫెసర్లు
కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విశ్వవిద్యాలయమైన కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకప్పుడు విద్యా కుసుమాలను వికసింపజేసిన ఈ క్యాంపస్, నేడు అధికారుల నిర్లక్ష్యం, అస్తవ్యస్త పాలన కారణంగా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీలోని దుస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం మెనూ ప్రకారం పెట్టడం లేదని, నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన యూనివర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ కేయూ మొదటి గేటు వద్ద గురువారం నిరసన చేపట్టారు. హాస్టల్ డైరెక్టర్ హుటాహుటిన చేరుకుని మెనూ ప్రకారం భోజన సౌకర్యాలు కల్పిస్తామని విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం కొసమెరుపు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ కేయూ కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ హాస్టళ్లలో తాము పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. ఒక్కో గదిలో ఐదు నుంచి ఆరుగురు విద్యార్థులను ఉంచుతూ డార్మెటరీ తరహాలో నెట్టుకొస్తున్నారని తెలిపారు. హాస్టళ్లలో సరైన ఫ్యాన్లు, లైట్లు లేవని, నీళ్లు వస్తే కరెంటు ఉండదు, కరెంటు ఉంటే నీళ్లు ఉండవు అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త హాస్టళ్ల నిర్మాణానికి గతంలో శంకుస్థాపనలు జరిగినా, ఇప్పటివరకు పునాది రాయి కూడా పడలేదని ఆరోపించారు. వర్సిటీలో దాదాపు 80 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 256 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట కేవలం 70 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఉన్న ప్రొఫెసర్లు కూడా విద్యాబోధన కంటే పరిపాలన పదవులకే పరిమితమవుతున్నారని, దీనివల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పే నాథుడే కరువయ్యారయని విమర్శించారు. సైన్స్ ల్యాబ్లో కనీస ఎక్విప్మెంట్, కెమికల్స్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో రీసెర్చ్ స్కాలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
మరోవైపు యూనివర్సిటీ భూములు అక్రమంగా కబ్జాలకు గురవుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు ఫిర్యాదులు అందుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. గతంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని, నిధులు కేటాయిస్తామని హామీలు ఇచ్చారని, అవి అమలుకు నోచుకోలేదని తెలిపారు. అక్రమాలపై యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని, వాటిపై ప్రశ్నించిన విద్యార్థులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ ఆఫీసుల్లో బిల్లుల అక్రమాలు, బీఈడీ కాలేజీ ప్రొఫెసర్ల అవినీతిపై అధికారులు కమిటీలు వేస్తున్నా, అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని అన్నారు. కమిటీ నివేదికలు బయటకు రాకుండా, అక్రమాలకు పాల్పడిన వారికే అధికారులు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లలో భోజనం, తదితర వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.



