లక్ష్యంతో కృషి చేస్తేనే విజయాలు సాధ్యం: కాటారం డీఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ – కాటారం
ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని కష్టపడి చదివితేనే జీవితంలో విజయాలను సాధించగలమని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా నిర్వహించిన “ఆదర్శ వైభవ్” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవరుచుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. విద్యతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని, పట్టుదలతో కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చని అన్నారు.
గత 36 సంవత్సరాలుగా ఆదర్శ విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థులను దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిపిన విషయాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే స్కూల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆదర్శ హై స్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషిత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




