కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయం 20వ రోజుకు ఆందోళన
సీపీఐ(ఎం) సీనియర్ నేతలు
సుభాషిణి అలీ, బృందా కరత్ మద్దతు
శివసేన ఎంపీ
గణపతి సావంత్
సంఘీభావం
ఆందోళనకు మళ్లీ
ఢిల్లీ పోలీసుల
అడ్డంకులు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పార్లమెంటుకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన నెల రోజులు పూర్తి చేసుకున్న తర్వాత జులై 20న ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా పాల్గొననున్నారు. మరోపక్క సీజేపీ చేపట్టిన ఆందోళన గురువారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం) సీనియర్ నేతలు సుభాషిణి అలీ, బృందా కరత్ మద్దతు తెలిపారు. శివసేన ఎంపీ అరవింద్ గణపతి సావంత్ సంఘీభావం తెలిపారు. సోనమ్ వాంగ్ చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఫోన్లో మాట్లాడి తమ మద్దతును ప్రకటించారు.
సీజేపీ ఆందోళనకు పోలీసుల అడ్డంకులు
సీజేపీ ఆందోళనకు ఢిల్లీ పోలీసులు మళ్లీ అడ్డంకులు సృష్టించారు. భారీ వర్షం కురవడంతో తలదాచుకునేందుకు సీజేపీ కార్యకర్తలు టార్పాలిన్లు తీసుకురాగా ఢిల్లీ పోలీసులు అనుమతించలేదు. దీంతో సీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ “రాత్రంతా వర్షం కురిసింది. నిరాహార దీక్షలో పాల్గొన్న విద్యార్థులను ఆ వర్షం నుంచి రక్షించడానికి మేం ఎంతో ప్రయత్నించాం. ఢిల్లీ పోలీసులు టార్పాలిన్లను లోపలికి తీసుకెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. మా పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు” అని అన్నారు.
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ ‘’నేను బ్రతికి ఉండాలని కోరుకునేవారు, ఇంటి నుంచి సందేశాలు పంపడం ఆపి ఢిల్లీకి వచ్చి పాదయాత్రలో పాల్గొనండి. చట్టాలు చేసే చోట మన గొంతు వినిపించేలా చేద్దాం’ అని అన్నారు.
విద్యార్థుల సమస్యలను పార్లమెంట్ పట్టించుకోవాలనీ, బాధ్యతతో స్పందించాలని కోరారు. సీజేపీ ప్రతినిధి విజేత దహియా మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని, తమ విన్నపాలను మరింత స్పష్టంగా తెలిపేందుకే పార్లమెంట్కు వెళ్దామనుకున్నట్టు చెప్పారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. ఎస్ఎఫ్ఐతో సహా విద్యార్థి సంఘాలూ ఈ సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నాయి. సోనమ్ వాంగ్చుక్, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ, డిమాండ్లను అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 20న పాదయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించింది.



