- ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో రైతు భరోసా తుది విడత నిధులు విడుదల
నవతెలంగాణ-హైదరాబాద్: ఖమ్మం అన్నదాత ఆశీర్వాద సభలో రైతు భరోసా తుది విడత నిధులను బటన్ నొక్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు. తెలంగాణలో 2029 జూన్లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. 2029లో జరిగే కురుక్షేత్రంలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే. పార్లమెంట్ సీట్లు 26, అసెంబ్లీవి 182కి పెరుగుతాయి. 182లో 117 సీట్లు గెలిచి రెండోసారి ప్రజాపాలన వస్తుంది. భద్రాచల రాముడిపై ఆన.. ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిన. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం. పాపాల భైరవుడిని ఫామ్హౌస్లో బంధించాం. ఆ పాపాల భైరవుడికి ఇకపై విముక్తి లేదు. ఆనాడు వరి వేస్తే.. ఉరి వేసినట్లే అని కేసీఆర్ అన్నారు. కానీ మేం వ్యవసాయం దండగ కాదు.. పండుగ అన్నాం. పేదలకు సన్నబియ్యం, వడ్లకు బోనస్ అందిస్తున్నాం.
కన్నెపల్లి పంప్హౌస్లు ఓపెన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కన్నెపల్లి పంప్లు ఆన్ చేస్తే భద్రాచల రాముడి ఆలయం సహా 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు. బీజేపీతో హరీశ్ రావు మంతనాలు జరుపుతున్నారో, లేదో భద్రాచల రాముడిపై ఒట్టేసి చెప్పాలి. కారు పార్టీలో ఉంటావో లేదో కేసీఆర్పై ఒట్టేసి హరీశ్ రావు చెప్పాలి. తాటిచెట్టంత పెరిగినా ఆయనకు బుర్రలో గుజ్జు లేదు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని కేటీఆర్ చెల్లెలే చెబుతున్నారు’ అని తెలిపారు.


