Saturday, June 7, 2025
E-PAPER
Homeజాతీయంబలవంతపు కూల్చివేతలు ఆపాలి

బలవంతపు కూల్చివేతలు ఆపాలి

- Advertisement -

– బుల్డోజర్‌ విధానానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన
– ఇది రాజ్యాంగం, మానవ హక్కుల ప్రత్యక్ష ఉల్లంఘన : సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బృందాకరత్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఢిల్లీలో బలవంతపు కూల్చివేతలు ఆపాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థల ఉమ్మడి వేదిక ‘ఆవాస్‌ అధికార్‌ జన్‌ ఆందోళన్‌’ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న బలవంతపు కూల్చివేత, తొలగింపు డ్రైవ్‌పై ఢిల్లీ కార్మికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బృందాకరత్‌ మాట్లాడుతూ ”ఢిల్లీలోని శ్రామిక పేదలకు బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఇండ్లు ఇవ్వలేదు. ఇప్పుడు పునరావాసం లేకుండా మురికివాడలను కూల్చివేస్తోంది. ఇది బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని బహిర్గతం చేస్తుంది” అని విమర్శించారు. ”లక్షలాది మందిని నివాసాల నుంచి పంపించి వేయడంతో వారిని అభద్రత, నిరుద్యోగం, నిరాశ్రయుల వైపు నెట్టివేస్తున్నారు. ఇది రాజ్యాంగం, మానవ హక్కుల ప్రత్యక్ష ఉల్లంఘన. అక్రమ కూల్చివేతలు, బలవంతపు తొలగింపులను వెంటనే ఆపాలి” అని ఆమె డిమాండ్‌ చేశారు. దీనితో పాటు, పునరావాసం లేకుండా నిర్వాసితులైన కుటుంబాలకు పరిహారం లేదా ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని అన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సుందరీకరణ పేరుతో ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు మురికివాడలను కూల్చివేసే పనిని సీపీఐ(ఎం) ఢిల్లీ కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా తీవ్రంగా ఖండించారు. వారి డిమాండ్లను అంగీకరించకపోతే, మురికివాడలను కూల్చివేసే పనిని వెంటనే ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె.నారాయణ (సీపీఐ), కేహర్‌ సింగ్‌, సుచేతా డే (సీపీఐఎంఎల్‌), శత్రుజిత్‌ సింగ్‌ (ఆర్‌ఎస్‌పీ), బిర్జు నాయక్‌ (సీజీపీఐ), హరికృష్ణ (ఫార్వర్డ్‌ బ్లాక్‌), సామాజిక సంస్థల కార్యకర్తలు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -