బీజేపీని ఓడించడమే ప్రతిపక్ష పార్టీల ప్రాధాన్యత
20న సీజేపీ పార్లమెంట్ మార్చ్ లో భాగస్వాములవుతాం
పార్టీలో ఆత్మవిమర్శకు అతీతులు ఎవరూ లేరు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పిలుపునిచ్చారు. ఇది ప్రతిపక్ష పార్టీల ప్రథమ ప్రాధాన్యత కావాలని సూచించారు. మంగళవారం పార్టీ కేంద్ర కమిటీ సమావేశం అనంతరం ఆయన సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఎకె గోపాలన్ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అందరికీ తెలిసినవే. దేశ వ్యాప్తంగా బీజేపీ ఎలా విస్తరిస్తోందో వివిధ రాష్ట్రాల ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ ప్రమాదాన్ని, ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోవడానికి, దాన్ని ఓడించడానికి దేశంలోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య రాజకీయ శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పని చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమైన ఈ పనిని వదిలి తమ రాజకీయ అంశాలను ముందుకు తీసుకువస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం కేరళం వచ్చి సీపీఐ(ఎం) నేతల పట్ల అగౌరవంగా మాట్లాడింది. అయినప్పటికీ తమ ప్రథమ ప్రాధాన్యత బీజేపీని ఓడించడమే.’ అని స్పష్టం చేశారు.
పార్లమెంట్ మార్చ్లో భాగస్వాములవుతాం
సీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే పార్లమెంట్ మార్చ్లో సీపీఐ(ఎం) ఎంపీలు భాగస్వామ్యులవుతారని , విద్యార్థి సంఘాలూ భాగస్వామ్యం అవుతాయని బేబీ తెలిపారు. పార్లమెంట్లో సీజేపీ ఆందోళనపై ఎంపీలు తమ గళాన్ని వినిపిస్తారన్నారు. విజింజం పోర్టులో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను స్విట్జర్లాండ్కు చెందిన ఎంఎస్సీ కంపెనీకి విక్రయించాలని నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మల్టీనేషనల్ కంపెనీల చేతికి ప్రాజెక్టును అప్పగించే ఎలాంటి చర్యలనైనా వ్యతిరేకిస్తామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పినరయి విజయన్, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం దీనిపై స్పందించారని తెలిపారు. విడి సతీషన్ ప్రభుత్వం నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, కానీ మీడియాలో ఏదేదో రాస్తున్నారని అన్నారు.
ఎన్నికల ఫలితాలపై దిద్దుబాటు చర్యలు
కేరళం, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలపై పార్టీ చిత్తశుద్ధితో కూడిన దిద్దుబాటు చర్యలు చేపడుతుందని బేబీ తెలిపారు. ‘సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను క్షుణ్ణంగా సమీక్షించింది. ఎన్నికల అంశాలను లేవనెత్తడంలో, ప్రచారాలు నిర్వహించడంలో, అభ్యర్థులను ఎంపిక చేయడంలో లోపాలు, బలహీనతలు ఉన్నాయని అంచనా వేసింది. వాటన్నింటినీ అధిగమించడానికి పార్టీ చిత్తశుద్ధితో కూడిన దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. ఆగస్టు చివరిలో పశ్చిమ బెంగాల్లో, సెప్టెంబర్ రెండో వారంలో కేరళంలో జరగనున్న విస్తృత రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ విషయమై స్పష్టమైన చర్యలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కేవలం ప్రజల కోసమే నిలబడే ఉద్యమమనీ, ప్రజలను ఒప్పించడంలో విఫలమవడమే ఎన్నికల ఓటమికి ప్రధాన కారణమని ఎంఏ. బేబీ పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి నుంచి శాఖా సభ్యుల వరకు అందరి కార్యకలాపాల్లో చిన్న, పెద్ద లోపాలు ఉన్నాయని, అయితే అవే వైఫల్యాలు అందరిలోనూ లేవన్నారు. ‘మనం చేసిన తప్పు ఏమిటి?’ అని అన్ని స్థాయిల కార్యకర్తలు తమను తాము సమీక్షించుకోవాలని సూచించారు. ఈ పార్టీలో ఆత్మవిమర్శకు అతీతులు ఎవరూ లేరని చెప్పారు.



