25వ రోజుకు సీజేపీ ఆందోళన
17వ రోజుకు వాంగ్చుక్ నిరాహార దీక్ష
వీరి నిరసనకు ప్రముఖుల సంఘీభావం
ఢిల్లీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రుల మద్దతు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సీబీఎస్ఈలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి దేశంలోని వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. జూన్ 20న జంతర్మంతర్ వద్ద ప్రారంభమైన ఈ ఆందోళనకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు, పౌర సమాజం నుంచి మద్దతు లభించింది. మరికొందరు తమ పూర్తి సంఘీభావాన్ని తెలిపారు. మరోపక్క సీజేపీ చేపట్టిన ఈ ఆందోళన మంగళవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. అలాగే పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష 17వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా, సినీ నటి స్వరా భాస్కర్, ఎన్సీపీ ఎంపీ ప్రియా సరోజ్, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్, బీకేయూ అధ్యక్షుడు నేత గుర్నామ్ సింగ్ చరునిలు సీజేపీ ఆందోళన చేస్తున్న శిబిరాన్ని సందర్శించారు. సోనమ్ వాంగ్చుక్ దీక్షకు, సీజేపీ ఆందోళనకు మద్దతు తెలిపారు.
ప్రముఖ నటి జీనత్ అమన్, నటుడు ఓమీ వైద్య, ‘ధురందర్’ నటి అయేషా ఖాన్, నటుడు అభయ్ డియోల్ సంఘీభావం తెలిపారు. నటుడు అతుల్ కులకర్ణి కూడా సీజేపీ ఆందోళనకు మద్దతు తెలిపారు.‘నిజాయితీ, కరుణతో ఈ దేశాన్ని పునర్నిర్మించండి’ అని ఆయన యువతను కోరారు. ‘రేపు ఒక ముఖ్యమైన రోజు. నా ఆశ మీపైనే ఉంది” అని కూడా ఆయన పేర్కొన్నారు. గాయకుడు, కళాకారుడు కాకా సైతం సీజేపీ ఆందోళనకు, సోనమ్ వాంగ్చుక్ దీక్షకు సంఘీభావం తెలిపారు.అలాగే సీనియర్ నటులు నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, రచయిత్రి అరుంధతి రాయ్, ఆర్థికవేత్త జయతీ ఘోష్లతో సహా పలువురు ప్రముఖ రచయితలు, నటులు, విద్యావేత్తల బృందం కూడా మద్దతు తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించినందుకు నిరసనకారులకు తాము “అపారమైన కృతజ్ఞతలు” తెలుపుతున్నామని, అయితే వారి ఆరోగ్యం క్షీణిస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని సంయుక్త ప్రకటనలో తెలిపారు.



