Friday, March 13, 2026
E-PAPER
Homeజాతీయంసామాన్యుడిపై ముప్పేట దాడి

సామాన్యుడిపై ముప్పేట దాడి

- Advertisement -

ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం పంజా
ఆహార వస్తువుల ధరలు పైపైకి
పల్లెల్లోనే భారం అధికం
త్వరలో గ్యాస్‌తో మరింత ఆజ్యం

హైదరాబాద్‌/ న్యూఢిల్లీ : అధిక ధరలతో దేశంలో సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ద్రవ్యోల్బణం మరోసారి పంజా విసిరింది. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరిలో 2.74 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. కేవలం నెల రోజుల్లోనే 3.21 శాతానికి ఎగబాకింది. ఈ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి.

అమెరికా యుద్ధోన్మాద చర్యలతో పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు భవిష్యత్తులో ధరలకు మరింత ఆజ్యం పోయనున్నాయని రిపోర్టులు వస్తోన్నాయి. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. జనవరిలో 2.13 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో ఏకంగా 3.47 శాతానికి చేరడం ఆందోళనకరం. కేవలం నెల రోజుల్లోనే 47 బేసిస్‌ పాయింట్ల మేర భారం పెరిగింది. టమోటా 45.29 శాతం, కాలీఫ్లవర్‌ 43.77 శాతం చొప్పున ఎగిసిన కూరగాయల ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. వెండి ఆభరణాలపై ఏకంగా 160.84 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం.

పల్లెల్లోనే ధరల కష్టం..
నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల ఒత్తిడి ఎక్కువగా ఉండటం ఆందోళనకర అంశం. ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.02 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో అది 3.37 శాతానికి చేరింది. మౌలిక వసతులు, రవాణా ఖర్చులు పెరగడంతో గ్రామాల్లోని నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది.

తెలంగాణలో రెట్టింపు..
దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరింత ఎక్కువ ద్రవ్యోల్బణం చోటు చేసుకుంది. జాతీయ సగటు 3.21 శాతంకంటే.. తెలంగాణలో ఏకంగా 5.02 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అంటే దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఒకలా ఉంటే.. తెలంగాణలో అది రెట్టింపు స్థాయిలో ఉంది. రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వాలు ధరలను అదుపు చేయడంలో విఫలమైతే, సామాన్యుడి పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ముంచుకొస్తున్న గ్యాస్‌ దడ..
ఇప్పటికే ద్రవ్యోల్బణం సెగతో అల్లాడుతున్న భారత్‌కు గ్యాస్‌ కొరత మరింత దడ పుట్టిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత తీవ్రమయ్యిందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక హెచ్చరించింది. ఈ పరిణామం రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి ప్రధాన కారణం కానుందని హెచ్చరించింది. గ్యాస్‌ కొరతతో బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయడంతో సాధారణంగా రూ.1,750 ఉండే కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.2,000 దాటేసింది.

కొందరు వ్యాపారులు రూ.3,000 చెల్లిస్తోన్నారు. దీనివల్ల చిన్న హోటళ్లలో సాధారణ భోజనం ధరలు ఇప్పటికే 10 శాతం మేర పెరిగాయి. మరింత పెరగొచ్చని అంచనా. మార్చి నెలలో గ్యాస్‌, చమురు ధరల అస్థిరత దీనిని మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే భారత్‌లో ధరల నియంత్రణ ఆర్‌బిఐకి అత్యంత సవాలుగా మారనుందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -