Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే దీక్ష విరమించా : వాంగ్‌చుక్‌

కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే దీక్ష విరమించా : వాంగ్‌చుక్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నీట్‌-యూజీ 2026 పేపర్‌ లీక్‌ వివాదంపై ప్రభుత్వం మూడు కీలక హామీలు ఇచ్చిందని సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ వెల్లడించారు. పరీక్షల వ్యవస్థలో జవాబుదారీతనం, విద్యార్థులపై పోలీసు చర్యలు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు సాయం వంటి అంశాలపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే తన నిరాహార దీక్షను విరమించినట్లు తెలిపారు.

26 రోజుల పాటు కొనసాగిన నిరాహార దీక్ష అనంతరం గురుగ్రామ్‌లోని మేదాంతా ఆస్పత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ ఆయన్ను కలిసి హామీల పత్రాన్ని అందజేశారు. గత రెండు రోజులుగా కేంద్రంతో చర్చలు జరిగాయని, మాటలకే పరిమితం కాకుండా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో దీక్షను రెండు రోజులు పొడిగించాల్సి వచ్చిందని వాంగ్‌చుక్‌ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం.. నీట్‌ పేపర్‌ లీక్‌తో పాటు పరీక్షల వ్యవస్థలో ఉన్న లోపాలు, బాధ్యులపై చర్యల అంశాన్ని పార్లమెంట్‌లో చర్చిస్తామని తెలిపింది. పేపర్‌ లీక్‌ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.

అలాగే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన చేసిన విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ హామీల తర్వాతే తాను నిరాహార దీక్షను విరమించానని వాంగ్‌చుక్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక మంది దీక్ష విరమించాలని కోరిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.

దీక్ష ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకునే దిశగా సాగాలని వాంగ్‌చుక్‌కు సూచించారు. మరోవైపు పేపర్‌ లీక్‌ ఘటనలపై ఇప్పటికే నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -