Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజకీయ ఒత్తిడితో కాళేశ్వరంపై నిర్ణయం తీసుకోలేం

రాజకీయ ఒత్తిడితో కాళేశ్వరంపై నిర్ణయం తీసుకోలేం

- Advertisement -

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల భవిష్యత్‌ నిర్వహణపై కేంద్రానికి లేఖ
జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, ఎన్‌‌డీఎస్‌ఏ సాంకేతిక మార్గదర్శకాలు కోరాలి
ఆ నివేదికల ఆధారంగానే 
తుది నిర్ణయం : 
మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్‌‌డీఎస్‌ఏ) సూచించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో (నీటి నిల్వ లేకుండా) విధానంలో నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నీటి నిల్వ, పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలా వద్దా అన్న అంశంపై కేవలం రాజకీయ ఒత్తిళ్లు లేదా పైకి కనిపించే పరిస్థితుల ఆధారంగా కాకుండా, అర్హత కలిగిన సాంకేతిక సంస్థల లిఖితపూర్వక సిఫారసుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు పంపే లేఖలో ఎన్‌డీఎస్‌ఏ నివేదికలోని కీలక సిఫారసులు, గత సాంకేతిక పరిశీలనల వివరాలు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యసీ) నివేదికలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్‌) పరీక్షల ఫలితాలు, రాఫ్ట్ ఫౌండేషన్ కింద గుర్తించిన ఖాళీల వివరాలు, ఫొటోలు, ఇతర ఇంజినీరింగ్ ఆధారాలు అన్నింటినీ జతచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బ్యారేజీలను ఎందుకు నీటి నిల్వకు, పంపింగ్‌కు వినియోగించడం లేదన్న విషయాన్ని పూర్తి సాంకేతిక ఆధారాలతో కేంద్రానికి వివరించాలని సూచించారు. సమర్థ సాంకేతిక సంస్థల నుంచి అధికారిక అభిప్రాయం కోరాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం మొత్తం అధికారిక రికార్డులో ఉండాలని చెప్పారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులకు వెంటనే అందేలా రాష్ట్ర ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ ద్వారా లేఖను స్వయంగా అందజేయాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీలపై జరుగుతున్న ప్రతి శాస్త్రీయ పరిశీలన, ప్రతి సాంకేతిక పరీక్ష కేంద్ర ప్రభుత్వం, ఎన్‌డీఎస్‌ఏ సూచనల ప్రకారమే నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల భద్రత, నిర్మాణాల స్థిరత్వం, శాస్త్రీయ ప్రమాణాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు.

​అన్నారం బ్యారేజీలోనూ నీటినిల్వ సురక్షితం కాదు
బ్యారేజీల పునరుద్ధరణ పనులపై జరిగిన సమీక్షలో అధికారులు మంత్రి దృష్టికి కీలక అంశాలను తీసుకొచ్చారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యపీఆర్‌ఎస్‌) తాజా జీపీఆర్ పరీక్షలు, ఇతర సాంకేతిక సమాచారం విశ్లేషణను తుది దశకు తీసుకెళ్లిందని ‌వివరించారు. అన్నారం బ్యారేజీ రాఫ్ట్ ఫౌండేషన్ కింద కూడా ఖాళీలు ఉన్నట్టు సూచించే సాంకేతిక ఆధారాలు లభించాయనీ, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ కూడా నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధ్యయనాల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ వచ్చేనెలాఖరులోగా సిద్ధమవుతుందనీ, మధ్య సెప్టెంబర్ నాటికి ప్రాథమిక వ్యయ అంచనాలు కూడా సిద్ధం కానున్నాయని అధికారులు వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అదనపు సాంకేతిక విశ్లేషణలు మరో రెండు వారాల్లో పూర్తవుతాయని వివరించారు. వాటిని టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ ముందు ఉంచాలని మంత్రి ఆదేశించారు. కనిపించే నీరు ఒక్కటే ప్రమాణం కాదనీ, పంపింగ్‌కు శాస్త్రీయ పరిస్థితులు తప్పనిసరి అని అధికారులు చెప్పారు. కేవలం దిగువకు నీరు ప్రవహిస్తున్నందుకే పంపింగ్ సాధ్యమవుతుందని భావించడం సరికాదని వారు స్పష్టం చేశారు. పంపింగ్‌కు అవసరమైన అప్‌స్ట్రీమ్ నీటి మట్టం ప్రస్తుతం కొనసాగించే పరిస్థితి లేదనీ, తాత్కాలిక ఏర్పాట్లతో పంపింగ్‌కు ప్రయత్నించడం వల్ల ఫలితం లేకపోవడమే కాకుండా బ్యారేజీల కింద ఉన్న నిర్మాణ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంత్రి స్పందిస్తూ, “కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఒక్క అడుగు కూడా రాజకీయ ఒత్తిడితో తీసుకోలేమని అన్నారు. ప్రతి నిర్ణయం శాస్త్రీయ ఆధారాలు, ఇంజినీరింగ్ ప్రమాణాలు, నిపుణుల సిఫారసుల మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని చెప్పారు.

​పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపైనా మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న అంశాలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రస్తుతం ‌డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్‌) ప్రాసెసింగ్ ముందుకు సాగడం లేదని అధికారులు వివరించారు. ఈ ‌కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాస్‌‌తోపాటు పలువురు సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -