Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యకు 30 శాతం నిధులు కేటాయించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య అనేది సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు మూలస్తంభం అయినప్పటికీ ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందనీ, అనేక విద్యాసంస్థల్లో భవనాలు, తరగతి గదులు, ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, హాస్టళ్లు సరిపడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

ఉపాధ్యాయుల పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు రూ.8,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.వాటిని బడ్జెట్‌లో చేర్చి తక్షణం బకాయిలు విడుదల చేయాలనీ, వీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఈ బకాయిల వల్ల చదువులు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా భావించాలని వారు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను బలోపేతం చేయడం ద్వారా అందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థుల ప్రాథమిక అవసరాలైన వసతి, భోజనం, విద్యా సౌకర్యాలను ప్రభుత్వం బాధ్యతగా కల్పించాల్సి ఉండగా, వాటిని ఖరీదుగా మార్చడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బడ్జెట్‌లో విద్యకు కేవలం 7.56 శాతం నిధులు మాత్రమే కేటాయించడంతో యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది కొరత, హాస్టల్‌ సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం విద్యార్థులపై అదనపు భారం మోపడం సరైనది కాదని పేర్కొన్నారు. యూనివర్సిటీల అవసరాల మేరకు బ్లాక్‌ గ్రాంట్లు పెంచాలనీ, పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ విద్యార్థుల ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -