Sunday, June 8, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆ దెయ్యాలెవరో కవితే చెప్పాలి

ఆ దెయ్యాలెవరో కవితే చెప్పాలి

- Advertisement -

– త్వరలో భూబకాసురుల సంగతి తేలుస్తాం
– పేదలకు ఇందిరమ్మ భూములు
– నాలుగు మండలాల్లో పైలెట్‌ మోడ్‌లో భూభారతి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేసీఆర్‌ దగ్గర ఉన్న దెయ్యాలెవరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితే చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు దోస్తానా ఉందనీ, కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని వెల్లడించారు. కవిత ఎపిసోడ్‌ టీ కప్పులో తుపాన్‌ అని ఆయన కొట్టిపారేశారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేవుడు, దెయ్యాలు ఉన్నాయంటూనే కవిత ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కి బీజేపీతో బంధం ఉందని బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని అంగీకరించారని గుర్తుచేశారు. గత కేసీఆర్‌ ప్రభుత్వంలోని భూబకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని హెచ్చరించారు. ఈడీ అధికారులు తన ఇంటికి ఎప్పుడూ రాలేదని… వారు తన ఇంటికి ఎందుకు రావట్లేదో కేటీఆర్‌ అడిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అర్ధరాత్రయినా రాహుల్‌గాంధీని కలిసే చనువు రేవంత్‌రెడ్డికి ఉన్నదని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్‌ విచారణకు ఎవరిని పిలవాలో తమ ప్రభుత్వం నిర్ణయించదని నొక్కి చెప్పారు. ప్రభుత్వం చేతిలోనే పవర్స్‌ ఉంటే కేసీఆర్‌ను తొలి ముద్దాయిగా కూర్చోపెట్టి ప్రశ్నించే వాళ్లమన్నారు. కాళేశ్వరంలో ఎల్‌ అండ్‌ టీ అసలైన ముద్దాయి అని పొంగులేటి చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయారనీ, దాన్ని డైవర్ట్‌ చేసేందుకు అబద్ధాలు ఆడుతున్నారని వివరించారు.
గుంజుకున్న భూములను స్వాధీనం చేసుకుంటాం
త్వరలో పేదలకు ఇందిరమ్మ భూములు ఇచ్చేందుకు ప్రభుత్వ సుముఖంగా ఉన్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత పేదలను మోసం చేసి పెత్తందారులు, భూ స్వాములు ఆ భూములను గుంజుకున్నట్లు మంత్రి వివరించారు. గత పదేండ్లలో ఇది ఎక్కువగా జరిగిందన్నారు. అందుకే అసైన్డ్‌ భూములను ఎంక్వైయిరీ చేసి పేదలవా? కావా? అనేది తేల్చనున్నట్టు తెలిపారు. పేదల నుంచి పేదలకు భూమి ట్రాన్స్‌ఫర్‌ అయితే ఏం కాదనీ, కానీ భూ స్వాములు, కార్పొరేట్‌ వ్యవస్థలు, శక్తులు, సంస్థలు, భూ బకాసురులకు అసైన్డ్‌ భూములు ఉన్నాయని తేలితే, వెంటనే సర్కార్‌ స్వాధీనం చేసుకోనున్నదని స్పష్టం చేశారు. దాన్ని మిగిలిన పేద కుటుంబాలకు అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 2.10 లక్షల లబ్దిదారులను ఎంపిక చేశామని అన్నారు. దీనికి అదనంగా చెంచులు, ఉప కులాలకు మరో 9,200 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే అర్హుల లిస్టు ఇన్‌చార్జి మంత్రులకు చేరిందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టును కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. కేటీఆర్‌ మాత్రం ఎలాంటి లిస్టు ఇవ్వలేదని తెలిపారు. పార్టీలక తీతంగా పేదలకు స్కీమ్‌లు అందజేస్తామన్నారు. ఇక ఫైలట్‌ ప్రాజెక్టులో 42 వేలు ఇండ్లు టార్గెట్‌ పెట్టుకోగా, ఇప్పటికే 24 వేల ఇండ్లుకు పేమెంట్లు ఇచ్చామన్నారు. వీటిలో కొన్ని 15-20 రోజుల్లోనే గహ ప్రవేశాలు చేయబోతున్నామన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక, ఇటుక ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదన్నారు. జిల్లా స్థాయిలో అడిషనల్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. ఏడాది కిందటి ధరలకే పంపిణీ చేయాలని వ్యాపారాలను ప్రభుత్వం కోరిందన్నారు. ఇక అర్బన్‌ ఏరియాల్లో గతంలోలా దూర ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించబోమని మంత్రి పొంగులేటి తెలిపారు. జీ ప్లస్‌ 3, జీ ప్లస్‌ 4లో క్లోజ్‌ చేస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 16 స్లమ్స్‌ను గుర్తించామనీ, వారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, వంటి సిటీల్లోనూ ఈ పాలసీని అమలు చేస్తామన్నారు. గతంలో అర్బన్‌ ఏరియాల నుంచి 25 నుంచి 30 కి.మీ దూరంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇచ్చారనీ, దీంతో సిటీలో ఉపాధి పొందే వారికి నష్టం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లతో దాదాపు 90 శాతం గ్రామాల్లో పేదలకు ఇండ్లు అందే అవకాశం ఉన్నదన్నారు.
భూ భారతిని నాలుగు మండలాల్లో పైలట్‌ మోడ్‌లో అమలు చేసి, సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. భూ భారతి ద్వారా సాధాభై నామా భూములు కాకుండా మిగతావన్నీ క్లియర్‌ చేస్తామన్నారు. 95 శాతం దరఖాస్తు దారులకు సమస్య పరిష్కరించబడుతుందన్నారు. ధరణిలో 9.26 లక్షల అప్లికేషన్లు వచ్చాయనీ, వీటిలో కొన్నింటికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయన్నారు. సాధాభైనామాల్లో కొన్ని నకిలీవి ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సర్వే నెంబరు, రికార్డు, భూముల ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇందు కోసం ఆరు వేల సర్వేయర్లను తీసుకోబోతున్నామన్నారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఇప్పటికే ట్రైనింగ్‌ ప్రక్రియ జరుగుతుం దన్నారు. గ్రామాల్లో జీపీవోలు కూడా రాబోతున్నా రన్నారు. ఇక ఏఐ టెక్నాలజీ వినియోగించి రిజి స్ట్రేషన్లలో పారదర్శకతను చూపుతున్నట్టు మంత్రి వివరించారు. స్లాట్‌ విధానంతో కొన్ని సమస్యలకు చెక్‌ పెట్టొచ్చన్నారు. భూములపై ఫోరెన్సిక్‌ అడిట్‌ కూడా నిర్వహించబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. దీని వలన కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రే షన్లు పూర్తి కావడంతో పాటు వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గుతుందన్నారు. అవినీతి చేసేందుకు ఆస్కారం ఉండదన్నారు. రిజిస్ట్రేషన్‌ ఎందుకు కాదనేదానిపై ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చేలా క్లాజ్‌ పొందు పరిచినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -