Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవంట గదికి 'వార్‌' సెగలు

వంట గదికి ‘వార్‌’ సెగలు

- Advertisement -

– భారీగా పెరిగిన నూనె, పామాయిల్‌ ధరలు
– మార్కెట్‌లో ఆయిల్‌ కొరత
– చుక్కలనంటిన ప్లాసిక్‌ కవర్ల ధరలు
నవతెలంగాణ- ఉస్మానియా యూనివర్సిటీ

అమెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా హైదరాబాద్‌పై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వంట నూనెలు, పామాయిల్‌, గ్యాస్‌ సిలిండర్ల ధరల పెరుగుదల ప్రభావం నేరుగా వంటగదిపై పడుతోంది. మార్కెట్‌లో సరఫరా కొరత ఏర్పడటంతో వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో నూనెల ధరలూ పెరిగాయి.
సన్‌ఫ్లవర్‌ నూనె, పామాయిల్‌ ధరలు పది రోజుల్లో గణనీయంగా పెరిగాయి. వారం కిందట లీటర్‌కు రూ.130-140 మధ్య ఉన్న ఫ్రీడం, గోల్డ్‌ డ్రాప్‌, సన్‌ఫ్లవర్‌, ఫార్చ్యూన్‌, విజయ, ప్రియ వంటి బ్రాండ్ల నూనెలు ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.170-180కి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిటైల్‌లో లీటర్‌కు రూ.190 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. కంపెనీల వద్ద కూడా సరిపడా నూనెలు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులకు, డీలర్స్‌కు సర్దుబాటు చేసుకుంటున్నట్టు తెలిసింది. పామాయిల్‌ ధర లీటర్‌కు రూ.100-105 నుంచి రూ.127-130 వరకు పెరిగింది. సరఫరా తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ విక్రయ వేదికల్లో కూడా పలుచోట్ల ”ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌” కనిపించడం గమనార్హం. వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్యాస్‌ సిలిండర్ల కొరత
నగరంలోని కొన్ని స్టార్‌ హోటళ్లలో కూడా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఓపెన్‌ మార్కెట్‌లో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు విక్రయిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. డీలర్లు కూడా ఎక్కువ సిలిండర్లు ఇవ్వలేక సర్దుబాటు చేసుకుంటున్నట్టు సమాచారం.
ప్లాస్టిక్‌ కవర్ల ధరల పెరుగుదల
గ్యాస్‌, నూనెల ధరలతోపాటు ప్లాస్టిక్‌ కవర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో కిలోకు రూ.140 ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను ప్రస్తుతం రూ.260-270 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల కారణంగా చిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కొన్ని చోట్ల మూతపడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -