నవతెలంగాణ – హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి జలకళ వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ఎట్టకేలకు కృష్ణా జలాలు తెలంగాణలోని జూరాల ప్రాజెక్టును తాకాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లకు వరద పోటెత్తడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, జూరాలకు ఆదివారం రాత్రికి 22,600 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. సోమవారం ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం జూరాల జలాశయంలో నీటి నిల్వ 5.897 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి ఇదే స్థాయిలో వరద కొనసాగితే, త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన తర్వాతే ఎత్తిపోతల పథకాలకు, కాలువలకు నీటిని అందిస్తామని ప్రాజెక్టు డీఈ నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.



