ఏటిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కట్
రోడ్డు ఎక్కిన రైతులు
నవతెలంగాణ-పుల్కల్
మండల పరిధిలో ఉన్న పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్, గ్రామాలలోనీ ఏటిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు, చాటింపు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయం పూర్తిగా నీటిపారుదలపై ఆధారపడి ఉన్న సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ముందు రైతులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా విషయం తెలుసుకున్న పుల్కల్ తహసీల్దార్ వంశీకృష్ణ, స్థానిక సీఐ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా విన్న అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ సరఫరా అంశాన్ని అత్యవసరంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని, రైతుల జీవనాధారమైన సాగుకు ప్రభుత్వం, విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తది తరులు పాల్గొన్నారు



