ఇరాన్ను హెచ్చరిస్తూ ట్రంప్ వీడియోలు పోస్ట్
యుద్ధంలో చతికిలపడి కృత్రిమ మేథను
ఆసరా చేసుకున్న అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్ : ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందాన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి మారింది. యుద్ధంలో భారీగా నష్టపోయిన ట్రంప్ ..ఇరాన్ చర్చలంటూ..మరో వైపు హెచ్చరికలు చేస్తున్నారు. చివరికి ఏం చేయలేని స్థితిలో ఏఐ చిత్రాలు పోస్టు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.
ఏం జరిగింది..?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద పోస్టు పెట్టారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో షేర్ చేసిన ఏఐ జనరేటెడ్ ఫొటోలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘గార్డియన్స్ ఆఫ్ ద వరల్డ్’’ పేరుతో షేర్ చేసిన తొలి ఫొటోలో ట్రంప్ ప్రపంచాన్ని పరిశీలిస్తున్నట్టు గా కనిపించారు. ముందు భాగంలో అమెరికా యుద్ధవిమానాలు ఎగురుతుండగా, రెండు వైపులా ఇరాన్పై భారీ పేలుళ్లు, మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. సముద్రంలో అమెరికా యుద్ధనౌకలు మోహరించినట్టు కూడా ఈ ఫొటోలో చూడొచ్చు. ‘‘స్ట్రైక్ ఆన్ ఖర్గ్’’ పేరుతో ఉన్న మరో చిత్రంలో ఖర్గ్ ద్వీపంలోని ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్పై అమెరికా యుద్ధ విమానాలు దాడి చేస్తున్నట్టుగా చూపించారు. చమురు నిల్వ ట్యాంకులు పేలిపోవడం, సముద్రంలో నౌకల మధ్య భారీ అగ్నికీలలు ఎగిసిపడడం వంటి దృశ్యాలతో ఈ ఫొటోను రూపొందించారు. ఇరాన్ చమురు ఎగుమతికి కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.‘‘It’s Our Oil Tanker Now’’ అనే మరో చిత్రంలో ట్రంప్ అమెరికా జెండా పట్టుకుని ఇరాన్ చమురు ట్యాంకర్పై నిలబడి ఉండగా.. పక్కనే అమెరికా సైనికులు ఆయుధాలతో ఉంటారు. కొందరు వ్యక్తులు సముద్రంలోకి దూకుతున్నట్లు ఆ ఫొటోలో ఉంది. దీంతో ఇరాన్ ఓడను అమెరికా స్వాధీనం చేసుకుందనే భావన కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే, ట్రంప్ 2028, అమెరికా ఫస్ట్, ప్లాన్ ట్రస్టెడ్ వంటి నినాదాలతో పోస్టర్లను షేర్ చేశారు. ట్రంప్ పంచుకున్న ఈ ఏఐ చిత్రాలు వాస్తవాల కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.



