ఎన్ఎస్ ట్రేడర్స్కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
మానుకోట వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం
12 గంటలకు పైగా బైటాయింపు
ఆత్మహత్యాయత్నం చేసిన గిరిజన రైతు
నవతెలంగాణ-మహబూబాబాద్
తమ పంటను విక్రయించిన డబ్బులను వ్యాపారి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం మానుకోట వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన చేపట్టారు. దాదాపు 12గంటలకు పైగా నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఓ గిరిజన రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎస్ఐ ఉమ అప్రమత్తమై ఆయన్ను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఎన్ఎస్ ట్రేడర్స్కు చెందిన వ్యాపారి 20 మంది గిరిజన రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్న లను ఐదు నెలల కిందట కొనుగోలు చేశాడు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు రూ.30లక్షలు ఇవ్వకుండా ఆ వ్యాపారి రైతులను సతాయిస్తున్నాడు. ఈ విషయమై మార్కెట్ సెక్రెటరీ సుధాకర్కు విన్నవించగా తాను ఇప్పిస్తానని వారికి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం ఉదయం మార్కెట్ కు చేరుకుని ప్రధాన గేటుకు తాళం వేశారు. అనంతరం అక్కడే బైటాయించి ధర్నా కొనసాగించారు. ఈ విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న మార్కెట్ చైర్మెన్ సుధాకర్, వైస్ చైర్మెన్ మదన్ కుమార్ రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి వచ్చిన టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉమ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో ఆగ్రహించిన రైతు మూడు హోలీ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ రైతును కాపాడారు. వెంటనే తమకు రావాల్సిన రూ.30లక్షలు ఇప్పించాలని, లేదంటే ఆ వ్యాపారిని అప్పగించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.



