Sunday, June 8, 2025
E-PAPER
Homeక్రైమ్షాద్‌నగర్‌లోరూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

షాద్‌నగర్‌లోరూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

- Advertisement -

ఓ దాబాలో ఓపీఎం 632 గ్రాములు, కేజీ గంజాయి, 1.5 కేజీల హెరాయిన్‌, 2.8 కేజీల పప్పి స్ట్రా స్వాధీనం
ఒకరి అరెస్టు, రిమాండ్‌ : సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడి
నవతెలంగాణ-మియాపూర్‌

రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌, గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల క్రయవిక్రయాలను నిషేధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని టోల్‌ ప్లాజా సమీపంలో రూ.3 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకోవడం సంచలనం రేకెత్తించింది. రాయికల్‌ టోల్‌గేట్‌ సమీపంలోని ఓ మార్వాడీ దాబాలో ఓ వ్యక్తి మాదకద్రవ్యాలను అమ్ముతున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో షాద్‌నగర్‌, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మాదకద్రవ్యాల అమ్మకాల గుట్టు రట్టయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ అవినాష్‌ మహంతి మీడియాకు శుక్రవారం వెల్లడించారు. రాజస్థాన్‌లోని మౌలాసర్‌కు చెందిన వికాస్‌ సోహు 2019లో షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ టోల్‌గేట్‌ ఎన్‌హెచ్‌ 44 సమీపంలోని సంజు భారు మార్వాడీ దాబాలో పనికి వచ్చాడు. ముందుగా వాచ్‌మెన్‌గా పనిచేశాడు. నెమ్మదిగా వంట నేర్చుకున్నాడు. ఆ తరువాత వంట మాస్టర్‌గా పనిచేశాడు. అయితే, దాబా యజమాని సంజు భారుకి గంజాయి తాగే అలవాటు ఉంది. ఇతను ధూల్‌పేటలోని సలీం రౌటర్‌ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసేవాడు. ఎవరైనా గంజాయి అడిగితే, అతను దాన్ని వారికి ఎక్కువ ధరకు అమ్మేవాడు. దాబాకు వచ్చే ఇతర రాష్ట్రాల డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, పాదచారులు, మొదలైన వారికి అమ్మేవాడు. వీరికి దూల్‌పేటకు చెందిన సలీమ్‌, మహేశ్వరానికి చెందిన రాజు, మధ్యప్రదేశ్‌కు చెందిన గన్పథ్‌ సహకరించేవారు. ఈ క్రమంలోనే దాబాలో గంజాయి అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే షాద్‌నగర్‌, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వికాస్‌ సోహును అరెస్టు చేశారు. అతన్ని విచారించగా భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓపీఎం 632 గ్రాములు, కేజీ గంజాయి, 1.5 కేజీల హెరాయిన్‌, 2.8 కేజీల పప్పి స్ట్రా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 87,700 నగదు, రూ.30వేల విలువైన 3 మొబైల్‌ ఫోన్లు, వేయింగ్‌ మెషీన్‌, ప్యాకింగ్‌ కవర్‌ ప్యాకెట్‌ సీజ్‌ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సీపీ తెలిపారు. భారీగా మాదకద్రవ్యాలను పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -