– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
– సత్తుపల్లిలో ఉమెన్ షెల్టర్ హోమ్ ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీలోని మసీద్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఉమెన్ షెల్టర్ హోమ్, స్త్రీ శక్తి సదన్ గ్రామ వికాస్ వసతి గృహ భవనాన్ని’ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ… ఆదరణకు నోచుకోని అనాధ మహిళలు, వితంతులు, మానసిక రుగ్మతలతో బాధపడే మహిళలకు ఈ ఉమెన్ షెల్టర్ హోంను ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ఉమెన్ షెల్టర్ హోమ్ నిర్వాహకులు సత్యనారాయణరెడ్డి, సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఆదరణ లేని ఒంటరి మహిళలు, దివ్యాంగులు, మానసిక వేదన అనుభవిస్తున్న వారికి సురక్షితమైన వసతి కల్పించడమే ఈ షెల్టర్ హోమ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అంతేకాకుండా, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారికి సరైన మార్గదర్శకం చేసేందుకు ప్రత్యేకంగా ‘కౌన్సిలింగ్ సెంటర్’ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెహానా కమల్, వైస్ చైర్పర్సన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి, తోట సుజలరాణిలతో పాటు ఉమెన్ షెల్టర్ చైర్మన్ సీఐ ముత్తులింగం, సెక్రెటరీ అనురాధ, ప్రభావతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు పాల్గొన్నారు.



