Saturday, March 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికల్తీ ముప్పు!

కల్తీ ముప్పు!

- Advertisement -

మొన్న సికింద్రాబాద్‌లో టాస్క్‌పోర్స్‌ దాడుల్లో రెండువేల ఆరువందల కిలోల నకిలీ పన్నీర్‌ పట్టుబడింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా దీని ఆధారంగా మరికొన్నిచోట్ల తనిఖీలు చేయగా మరో మూడువేల కిలోల పన్నీర్‌ దొరికింది. ఈ పన్నీర్‌ను హోటళ్లు, క్యాటరింగ్‌ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. తయారీలో రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలు ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నిన్న జియాగూడలో డెబ్బయి రెండు డ్రమ్ముల కల్తీ పచ్చడి పట్టుకున్నారు. అంతకుముందు కూడా పలుచోట్ల చేసిన సోదాల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కల్తీ మిర్చిపొడి, పసుపు, గడువు ముగిసిన ఆహారపదార్థాలు పట్టుబడ్డాయి.

ఈ వరుస ఘటనలతో నగరంలో ఆహారభద్రతపై ఆందోళన మొదలైంది. ఈ యాంత్రిక జీవనంలో చాలామంది హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఆసరగా చేసుకున్న అక్రమార్కులు కల్తీదందాకు యథేచ్ఛగా తెరలేపుతున్నారు. పండగ సీజన్‌లలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందన్నదే ఇక్కడ ప్రశ్న. ఎవరో సమాచారమిస్తే తప్ప నేరుగా పట్టుకోలేని నిద్రావస్తలో అధికార యంత్రాంగం ఉండటం శోచనీయం!

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కల్తీ ఆహార దందాలను ప్రజల ఆరోగ్యంపై పెరుగుతున్న దాడిగానే భావించాలి. రోజువారిగా వినియోగించే ఆహారపదార్థాల్లోనే నకిలీ, కల్తీ పదార్థాలు కలిపి విక్రయించడం సామాన్య ప్రజల జీవన భద్రతకు సవాల్‌గా మారింది. పాలు, నెయ్యి, నూనెలు, మసాలాల వంటి ఎక్కువ అవసరమైన వస్తువులే కల్తీకి గురవుతున్న పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో నకిలీ ఆహార పదార్థాలను నిల్వచేసి ఉంచడంలో కేవలం వ్యాపారుల దురాశే కాకుండా, ఇందులో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే క్రూరత్వం కూడా కనిపిస్తోంది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనుకునే ఆశతో కొంతమంది నాణ్యతను పూర్తిగా పక్కనపెట్టి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించడం అత్యంత ప్రమాదకరం. రసాయనాలు కలిపిన పచ్చళ్లు, నిల్వ కోసం వాడే హానికర పదార్థాలు, కృత్రిమ రంగులు ఇవన్నీ శరీరంపై నెమ్మదిగా విషంలా పనిచేస్తాయి. జీర్ణసమస్యలు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్‌ వరకు దారితీసే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం కలిగిస్తాయి. ఫుడ్‌ పాయిజన్‌ కేసులు పెరగడానికి కూడా ఆహార పదార్థాలలో నాణ్యత లేకపోవడమే ప్రధాన కారణం.

ఇంకా పలుచోట్ల చేసిన తనిఖీల్లో మూడు వేల కిలోల కల్తీ నెయ్యి పట్టుబడింది. పదకొండు వందల కిలోలకు పైగా కల్తీ జింజర్‌-గార్లిక్‌ పేస్ట్‌ స్వాధీనమైంది. వీటిలో సిట్రిక్‌ యాసిడ్‌, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. జియాగూడలో నకిలీ పచ్చళ్ల కేంద్రంపై చేసిన దాడిలో పాడైన కూరగాయలు, అతి తక్కువ నాణ్యత గల పదార్థాలతో తయారు చేస్తున్నట్టు నిర్ధారణ అయింది. బోరబండ, సికింద్రాబాద్‌లో పెద్దస్థాయిలో అనధికార యూనిట్లు, గోదాములు బయటపడటం చూస్తే ఇదంతా వ్యవస్థీకృత మాఫియాలా కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, సమాజానికే ముప్పుగా మారుతోంది. కల్తీ ఆహారం కేవలం నాణ్యత సమస్యే కాదు, అది నేరపూరితం.

ఇది ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే తప్ప వేరేకాదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికార యంత్రాంగం హడావిడి చేస్తుంది తప్ప, దీనికి శాశ్వత పరిష్కారం చూపడటం లేదు. దాడులు జరిగినప్పుడు తప్ప, ఆ తర్వాత యథావిధిగా సాగడం పరిపాటిగా మారింది. బీఎన్‌ఎస్‌, ఫుడ్‌ సేప్టీ యాక్ట్‌ ప్రకారం కల్తీ ఆహారం లేదా డ్రింక్స్‌ అమ్మితే కనీసం ఆరునెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించాలి. తీవ్రమైన అనారోగ్యానికి గురైనా, ప్రాణపాయం ఏరపడినా జైలు, లేదా జీవితఖైదు విధించే అవకాశం ఉంది.ఈ లెక్కన ఎంత మందిని శిక్షించారు? ఎన్ని కేసులు నమోదు చేశారు? వేళ్లపై లెక్కకట్టేలా కూడా ఉండవంటే అతిశయోక్తికాదేమో!

ఇలా చూస్తే పచ్చళ్లు, పేస్ట్‌లు వంటి రోజువారి ఆహార పదర్థాలన్నీ కల్తీకి గురవుతున్నాయి. అంటే, మన ప్లేట్‌లో పడే ప్రతిపదార్థం కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతోంది. ఇందులో వినియోగదారుల పాత్రను కూడా తీసిపారేయలేం. తక్కువ ధరల ఆశతో నాణ్యత లేని ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ నకిలీ దందాను మనమే ప్రోత్సహిస్తున్నట్టు అవుతోంది. సరైన ప్రమాణాలు ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేయడం, ప్యాకింగ్‌ తయారీ తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గుర్తించడం, తయారీ లేబుళ్లను గమనించడం అత్యంత అవసరం. కల్తీ ఆహార దందాను అరికట్టాలంటే కేవలం దాడులు సరిపోవు. కఠినమైన శిక్షలు వేగవంతమైన న్యాయప్రక్రియ, ప్రజల్లో అవగాహన- ఈ మూడు కలిసొస్తేనే ఫలితం ఉంటుంది. లేదంటే ‘కల్తీ ఆహారం’ అనే ముప్పు మన సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తూనే ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -