నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో అధికార సీపీఐ(ఎం) బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్ చేసిన వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. అవన్నీ నిరాధారమైనవని, అర్ధంలేని మాటలని ఆయన వెల్లడించారు.
“బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఎల్లప్పుడూ వామపక్షాలే. పలు సందర్భాల్లో, కాంగ్రెస్సే అవకాశవాద ఒప్పందాలు కుదుర్చుకుంది. కాంగ్రెస్ను సులభంగా ఎదుర్కోగలమని బీజేపీకి తెలుసు, చాలా సందర్భాల్లో అది కాంగ్రెస్ విజయాన్నే కోరుకుంటుంది. ఈ ‘ఒప్పందం’ ఆరోపణలు, గతంలో ఇలాంటి ఒప్పందాలు చేసుకున్న తన చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ఒక ముందుజాగ్రత్త చర్య తప్ప మరేమీ కాదు. ఈ ఆరోపణలు చేస్తున్న వారు, ఎప్పటినుంచో ఇలాంటి రాజకీయ ఒప్పందాలకు అలవాటుపడినవారేనని తిరువనంతపురం మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.



