నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన పలువురు డిఎంకె నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలపై “అవమానకరమైన” వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టు ఎదుట డిఎంకె కార్యకర్తలు నిరసన చేపట్టారు. తూత్తుకుడిలోని పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహిస్తుండగా, మాజీ మంత్రి పి. గీతా జీవన్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కక్షసాధింపు చర్య ఉందని గీతా జీవన్ ఆరోపించారు. డిఎంకె ప్రశ్నలకు , చర్చకు సమాధానం ఇవ్వలేక విజయ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో ఆయనను అరెస్ట్ చేసిందని విమర్శించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను, ప్రజల గొంతుకను టివికె ప్రభుత్వం అణచివేస్తుందని మండిపడ్డారు. ఇటువంటి చర్యలకు డిఎంకె తలొగ్గదని హెచ్చరించారు. డిఎంకె కార్యకర్తలు టివికె ప్రభుత్వానికి వ్యతిరకంగా నినాదాలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిఎంకె నేతలను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తమిళనాడులో డీఎంకే నేతల అరెస్ట్
- Advertisement -
- Advertisement -



