Wednesday, March 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి

దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి

- Advertisement -

డీలిమిటేషన్‌లో కేంద్రం తీవ్ర వివక్ష
50 శాతం సీట్ల పెంపు ఏ ప్రాతిపదికణ చేస్తారు?
మన విదేశాంగ విధానం ఆందోళనకరం
ట్రంప్‌తో మాట్లాడి యుద్ధాని నివారించండి
ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీలో ఓ మీడియా సంస్థతో పలు విషయాలు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర అన్యాయం జరుగుతున్న నేపథ్యం లో దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఒక ప్రయివేటు టీవీ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎంత అంతరం ఉందో అంతే స్థాయిలో సీట్ల పెంపు జరగాలని డిమాండ్‌ చేశారు. 50 శాతం సీట్ల పెంపు అనేది ఫైనల్‌ బుల్లెట్‌ అనీ, ఏ లెక్క ప్రకారం ఆ పెంపు జరుగుతున్నదని ప్రశ్నించారు. ఇప్పటికే కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడిని ఢిల్లీ నుంచి ఖాళీ చేయించారని గుర్తుచేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగైతే జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలని సూచించారు. మొదటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదనీ, ఉత్తర, దక్షిణ భారతాలకి మధ్య అంతరాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పెంచుతున్నదని విమర్శించారు.

దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తాను ఇంకా ఎనిమిదేండ్లు తెలంగాణ రాజకీయాల్లో ఉంటానని సీఎం చెప్పారు. తాను దేశ రాజకీయాల్లో పనిచేయాలా? వద్దా? అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. మోడీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణాదిని ఐక్యం చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. దక్షిణాది నుంచి ఎన్నికైన వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మొదటి నుంచీ బీజేపీలో ఉన్నవారిని పక్కకు ఎందుకు పెట్టారని నిలదీశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణాది నేతలు రాష్ట్రపతులు అయ్యారని గుర్తుచేశారు. తమ పార్టీది ఇండియా అంతా ఒక్కటే అనే సిద్ధాంతం అని చెప్పారు. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన 12 ఏండ్లలో దక్షిణాదికి గుర్తింపు ఏదని ప్రశ్నించారు. రాజకీయ వివక్ష కొనసాగించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో, టాప్‌టెన్‌ పదవుల్లో ఒక్కటి కూడా దక్షిణాది నేతలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తమ నేత రాహుల్‌గాంధీ దేశం గురించి ఆలోచిస్తుంటే మోడీ, అమిత్‌షా అందుకు భిన్నంగా ప్రజలపై భారాలు మోపడంపై ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత అన్ని పార్టీలనూ పిలవటం బీజేపీకి ఆనవాయితీగా మారిందని విమర్శించారు.

పెట్టుబడులన్నింటినీ ప్రధాని మోడీ గుజరాత్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కూడా ఈ దేశంలో భాగమేననే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. మంచి ఎక్కడ ఉన్నా స్వీకరిస్తామన్నారు. గుజరాత్‌లో సబర్మతీ నదిని ప్రక్షాళన చేసిన బీజేపీ హైదరాబాద్‌లో మాత్రం మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికే రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగి ఖజానా ఖాళీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, అసెంబ్లీలో దీనిపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ పాలకులు 11.90 శాతం వడ్డీకి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ నచ్చితే నజరానా, లేదంటే జరిమానా అనే విధంగా ప్రజల పట్ల వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్‌తో తనకు వ్యక్తిగతంగా సమస్యలేమీ లేవనీ, ఆయన తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత సమర్ధవంతమైన ప్రతిపక్ష నాయకుని పాత్రని పోషించాలని ఆకాంక్షించారు. తమకు 2034 వరకు ప్రజలు అవకాశం ఇస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారత విదేశాంగ విధానం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. మన చుట్టూ ఉన్న ఏ ఒక్క దేశంతో కూడా భారత్‌కు సత్సంబంధాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకొచ్చినట్టే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధాన్ని ఆపి చమురును తీసుకురావొచ్చుగదా అంటూ మోడీని ఎద్దేవా చేశారు. దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశ ప్రధానిగా మోడీకి అండగా ఉంటామన్నారు. అయితే, ఆయన యాక్షన్‌ ప్లాన్‌ ఏంటో ప్రజలకు తెలపాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌నకు భారత ప్రధానిగా మోడీ ఫోన్‌ చేసి ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -